ఎక్కడో రష్యాలో ఉన్నవారికి దేశంలో వనరుల గురించి తెలిసింది: వ్యాక్సిన్ కొరతపై కేంద్రానికి కోర్టు చురకలు
న్యూఢిల్లీ: కోవిడ్ సెకండ్ వేవ్ పరిస్థితులు అత్యంత ప్రమాదకరంగా మారిన వేళ ఆవేదన వ్యక్తం చేసిన ఢిల్లీ హైకోర్టు, వ్యాక్సిన్ల కొరతకు సంబంధించి కేంద్రంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్కు చెందిన పనాసియా బయోటెక్ సంస్థ రష్యాకు చెందిన రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (RDIF)సహకారంతో స్పుత్నిక్ వీ టీకాను తయారు చేసేందుకు ముందుకొచ్చింది. అయితే కొన్ని అడ్డంకులు తలెత్తడంతో పనాసియా బయోటెక్ సంస్థ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ను జస్టిస్ మన్మోహన్ మరియు నజ్మీ వజీరీ ధర్మాసనం విచారణ చేసింది.
"కోవిడ్ సెకండ్ వేవ్ ఎంతటి దయనీయమైన పరిస్థితులకు దారి తీసిందో అందరం చూస్తున్నాం. ఒక బాధ్యతగల పౌరుడిగా మీరు కూడా ఆవేదనకు గురైఉంటారు. వ్యాక్సిన్ కొరత ప్రతి ఒక్కరిపై ప్రభావం చూపుతోంది. ఈరోజుటికి కూడా ఢిల్లీలో టీకా లభ్యత లేదు.భారత్లో మంచి ఉత్పత్తులు వనరులు ఉన్నాయి.అయితే వాటిని ఎలా వినియోగించుకోవాలో తెలిస్తే చాలు" అని ధర్మాసనం పేర్కొంది. ఎక్కడో రష్యాలో ఉండే వారు మన దేశంలోని హిమాచల్ ప్రదేశ్లో వనరులను గుర్తించారు. కానీ కేంద్రం మాత్రం ఇందులో విఫలమైందని ధర్మాసనం పేర్కొంది.

కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు...వెంటనే భారత్లో స్పుత్నిక్ వీ తయారీకి పనాసియా బయోటెక్ కంపెనీకి అన్ని అనుమతులు ఇవ్వడమే కాకుండా 2012 నుంచి వడ్డీతో పాటు రూ.14 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. ఆ మొత్తాన్ని కోర్టు వద్ద ఉంచాలని న్యాయస్థానం ఆదేశించింది. అంతేకాదు ఈ మొత్తంతో పాటు స్పుత్నిక్ వీ టీకా తయారీ తర్వాత టీకాల అమ్మకాల ద్వారా వచ్చే మొత్తం నుంచి 20శాతం కోర్టు రిజిస్ట్రీ వద్ద డిపాజిట్ చేయాలని కూడా న్యాయస్థానం ఆదేశించింది.
ఇదిలా ఉంటే రష్యాకు చెందిన రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ మరియు భారత్కు చెందిన పనాసియా బయోటెక్ సంస్థలు స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ను భారత్లో తయారు చేయాలని సంకల్పించాయి. మే 24వ తేదీన ఈ నిర్ణయం తీసుకున్నాయి. హిమాచల్ ప్రదేశ్లోని బడ్డి ప్రాంతంలో ఉన్న పనాసియా బయోటెక్ ఫెసిలిటీలో తొలిదశ టీకాలు ఉత్పత్తి అవుతాయి. ఆ తర్వాత ఈ టీకాలను క్వాలిటీ కంట్రోల్ కోసం రష్యాలోని గమలేయా సెంటర్కు పంపుతారు. అనంతరం పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ తయారీ మరికొద్ది రోజుల్లో ప్రారంభం అవుతుంది. ఈ ఏడాది ఏప్రిల్ 12వ తేదీన అత్యవసర పద్ధతిలో వినియోగించేందుకు స్పుత్నిక్ వీ వ్యాక్సిన్కు అనుమతి ఇవ్వడం జరిగింది. మే 14వ తేదీ నుంచి టీకా ఇవ్వడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఆర్డీఐఎఫ్ మరియు పనాసియా సంస్థలు ఏడాదికి 100 మిలియన్ డోసుల స్పుత్నిక్ వీని తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.












Click it and Unblock the Notifications