హత్యకు గురైన ఐబీ ఆఫీసర్ కుటుంబ సభ్యుల ఆవేదన ఇదీ.. అతనే బాధ్యుడని ఆరోపణలు..
ఢిల్లీ ఇంటెలిజెన్స్ బ్యూరో కానిస్టేబుల్ అంకిత్ శర్మ హత్యతో ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. పోలీసుల నిర్లక్ష్యం వల్లే అంకిత్ శర్మ హత్యకు గురయ్యారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.మంగళవారం రాత్రి అంకిత్ శర్మ మిస్సింగ్ కేసుపై తాము పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేయలేదన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్పై కూడా ఆరోపణలు చేశారు. అంకిత్ శర్మ హత్యకు అతనే బాధ్యుడని ఆరోపించారు.

అంకిత్ శర్మ తల్లి ఏమన్నారు..
మంగళవారం సాయంత్రం 4.30గంటలకు అంకిత్ విధుల నుంచి ఇంటికి వచ్చాడని ఆయన తల్లి చెప్పారు. ఆ తర్వాత కొద్దిసేపటికి కొంతమంది మూక ముగ్గురు వ్యక్తులను తీసుకెళ్లారని.. అందులో తన కొడుకు కూడా ఉన్నారని స్థానికులు చెప్పారన్నారు. తన కొడుకు అమాయకుడని.. లోకంలో ఏం జరుగుతుందో అతనికి తెలియదని అన్నారు. అంకిత్ తనతో ఎప్పుడూ 'డబ్బు గురించి పట్టించుకోవద్దు' అని చెప్పేవాడన్నారు. వైద్య ఖర్చుల గురించి బాధపడవద్దని చెప్పేవాడన్నారు.

ఆప్ కౌన్సిలర్పై ఆరోపణలు
ఇంటలిజెన్స్ బ్యూరోలోనే పనిచేసే అంకిత్ తండ్రి రవీందర్ శర్మ ఆమ్ ఆద్మీ పార్టీ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్ మద్దతుదారులపై ఆరోపణలు చేశారు. వాళ్లే తన కొడుకుపై దాడి చేసి హత్య చేశారని ఆరోపించారు. మొదట అతనిపై దాడి చేసిన తర్వాతనే.. కాల్చి చంపారని పోలీసులతో చెప్పారు. పోలీసులు ఆ ఆమ్ ఆద్మీ నేతను వదిలిపెట్టవద్దని.. ఈ చావులకు అతనే కారణమని మరో కుటుంబ సభ్యురాలు ఆరోపించారు. పోలీసుల తమ ఫిర్యాదులను పట్టించుకోలేదన్నారు.

అల్లరి మూకలకు ఆశ్రయం ఇచ్చాడన్న ఆరోపణలు
23 ఏళ్ల వయసులో అంకిత్ ఇంటలిజెన్స్ బ్యూరోలో చేరాడని అతని తల్లి చెప్పారు. అంకిత్ చాలా ప్రతిభావవంతుడని.. పోలీస్ జాబ్ కూడా వచ్చినప్పటికీ ఇంటలిజెన్స్ డిపార్ట్మెంట్లోనే చేరాడని అన్నారు. అంకిత్ హత్యకు ఆప్ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్ బాధ్యుడు అని అతని సోదరుడు ఆరోపించారు. తన సోదరుడితో పాటు మరో ముగ్గురిని కొంతమంది మూక తాహిర్ హుస్సేన్ ఇంట్లోకి తీసుకెళ్లారని ఆరోపించారు.
అల్లరిమూకలకు తాహిర్ హుస్సేన్ ఆశ్రయం కల్పించాడని, అతని ఇంటి నుంచి కాల్పులు కూడా జరిపారని,పెట్రోల్ బాంబులు,కత్తులతో దాడి చేశారని ఆరోపించారు. కొంతమంది సాధారణ పౌరులను కాపాడేందుకు అంకిత్ ప్రయత్నిస్తున్న సమయంలో.. ఓ మూక అతన్ని పట్టుకుని తాహిర్ హుస్సేన్ ఇంట్లోకి తీసుకెళ్లి హత్య చేసిందన్నారు.
Recommended Video


ఆప్ ఎమ్మెల్యేలు నిర్లక్ష్యం వహించారన్న న్యాయవాదులు
అదృశ్యమయ్యాడనుకున్న అంకిత్ శర్మ బుధవారం ఉదయం ఓ డ్రైనేజీలో మృతదేహమై కనిపించాడు. ఆయన తలపై తీవ్ర గాయాలు ఉన్నట్టు గుర్తించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై దాడి చేసి ఉంటారని, బలమైన వస్తువుతో కొట్టడం వల్ల తల ఛిద్రమై ఉంటుందని నిర్ధారించారు. ఆయన శరీరంపై బుల్లెట్ గాయాలు కూడా ఉన్నట్టు గుర్తించారు. అంకిత్ శర్మ కుటుంబానికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రూ.కోటి పరిహారం ప్రకటించారు. కాగా,ఢిల్లీలో హింస చెలరేగిన సమయంలో ఆప్ ఎమ్మెల్యేలు నిర్లక్ష్యంగా వ్యవహరించారని కొంతమంది న్యాయవాదులు ఆరోపించారు. ప్రజల నుంచి వచ్చిన ఎస్ఓఓస్ కాల్స్ పట్ల స్పందించలేదని.. హింసను అడ్డుకునేందుకు ఎక్కడా ప్రయత్నించలేదని ఆరోపించారు.












Click it and Unblock the Notifications