నోట్ల రద్దు దేశానికి మంచిదే, మోడీకి మద్దతివ్వండి: ఇన్ఫోసిస్ గోపాలకృష్ణన్
ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు క్రిస్ గోపాలకృష్ణన్ స్పందించారు.
బెంగళూరు: ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు క్రిస్ గోపాలకృష్ణన్ స్పందించారు. పెద్ద నోట్ల ఉపసంహరణతో దేశానికి మంచే జరుగుతుందని, ఈ విషయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి అండగా నిలవాలని గోపాలకృష్ణన్ పిలుపునిచ్చారు. నోట్ల రద్దు వల్ల తలెత్తిన సమస్యలు 50 రోజుల్లో పరిష్కారం అవుతాయన్న ప్రధానిని విశ్వసించాలని కోరారు.
'నల్లధనాన్ని నివారించేందుకు, తీవ్రవాదులకు ఆర్థికసాయం ఆగేలా చూడటంలో ఇది ఒక మంచి ప్రారంభం. ఈ విషయంలో ఆశావహ దృక్పథాన్ని కలిగి ఉందాం. అలా చేస్తేనే నోట్ల రద్దు వల్ల తలెత్తిన కష్టాలను సాధ్యమైనంత తగ్గించవచ్చు. ఈ నిర్ణయానికి మద్దతు ఇచ్చి, అందరం కలిసికట్టుగా పనిచేస్తే, ప్రధాని చెప్పినట్లే 50 రోజుల్లో సమస్యలు తీరతాయనే ఆశిద్దాం' అని అన్నారు.

అంతేగాక, 'ప్రధాని కూడా ప్రజల మద్దతు ఆశిస్తున్నారు. కొత్త నోట్ల జారీ ప్రక్రియను, ఎలక్ట్రానిక్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలి. గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలకు పరిష్కారం చూపాలి. ఆర్థిక మంత్రిత్వ శాఖ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా ఇందుకు కృషి చేస్తున్నాయనే నమ్ముతున్నా' అని క్రిస్ గోపాలకృష్ణన్ చెప్పారు.
ఇక ఐరోపా సమాఖ్య (ఈయూ)లోని 23 దేశాలతో ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందాలను రద్దు చేసుకోవాలన్న భారత నిర్ణయంపై ఈయూ ఆందోళన వ్యక్తం చేయడంపై కూడా ఆయన స్పందించారు. 'ఆ అంశం చుట్టూ రాజకీయాలు, వ్యాపారం' ఉన్నాయని పేర్కొన్నారు. పరిశ్రమలు ప్రభుత్వంతో కలిసి సాగుతూ, ఒప్పందాల రద్దుకు గల కారణాలను అర్థం చేసుకోవాలని అన్నారు. దేశాలు, ప్రాంతాల మధ్య మరింత సహకారంతోనే భవిష్యత్తు ఆధారపడి ఉందని వివరించారు.
కాగా, యూఐడీఏఐ(ఆధార్) మాజీ ఛైర్మన్ నందన్ నీలేకని కూడా నోట్ల రద్దు అంశంపై మంగళవారం స్పందించారు. పెద్ద నోట్ల రద్దు, నగదు రహిత లావాదేవీలతో మనదేశంలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఇది దేశానికి మంచి పరిణామమేనని తెలిపారు.












Click it and Unblock the Notifications