Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇది పర్‍ఫెక్ట్ నిజం: ప్రగతి మంత్రంతో దక్షిణ భారతంలో పాగా.. ఇది అమిత్ షా వ్యూహం

వచ్చే పార్లమెంట్ ఎన్నికల నాటికి దక్షిణ భారత రాష్ట్రాల్లో ప్రాభవం సంపాదించి బలం పెంచుకునే దిశగా పార్టీ కార్యకలాపాలు సాగించాలని బీజేపీ అధినాయకత్వం నిర్ణయించింది.కాంగ్రెస్‌ పార్టీని సాధ్యమైనంత మేర కనుమర

న్యూఢిల్లీ: వచ్చే పార్లమెంట్ ఎన్నికల నాటికి దక్షిణ భారత రాష్ట్రాల్లో ప్రాభవం సంపాదించి బలం పెంచుకునే దిశగా పార్టీ కార్యకలాపాలు సాగించాలని బీజేపీ అధినాయకత్వం నిర్ణయించింది. కాంగ్రెస్‌ పార్టీని సాధ్యమైనంత మేర కనుమరుగు చేయాలని లక్ష్యంగా పెట్టుకొంది.

ఇందుకోసం కలిసివచ్చే పార్టీలను కలుపుకొనిపోవడం, లేదంటే స్వతంత్రంగా నిలబడి కాంగ్రెస్‌ పార్టీ ఇక ఎదిగే అవకాశం లేకుండా చేయాలని భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళల్లో సాధ్యమైనన్ని ఎక్కువ లోక్‌సభస్థానాలను సొంతంగా చేజిక్కించుకోవాలన్న దీర్ఘకాలిక ప్రణాళికలకు పదును పెడుతోంది.

ఈ వ్యూహంలో భాగంగా కలిసొచ్చే పార్టీలతో మితృత్వాన్ని కొనసాగించడానికైనా, అవసరమైతే తెంచుకోవడానికైనా, కొత్త శతృత్వాన్ని పెంచుకోవడానికైనా సిద్ధమేనని కమలనాథులు చెబుతున్నాయి. 2019 నాటికి తాము బలపడటమే పరమావధిగా ముందుకెళ్తామే తప్ప ప్రత్యర్థి పార్టీలకు మేలుచేయడానికి అవకాశం కల్పించబోమని బీజేపీ కీలక నేతలు పేర్కొంటున్నారు.

తెలంగాణలో ఒంటరిగానే బీజేపీ పయనం

తెలంగాణలో ఒంటరిగానే బీజేపీ పయనం

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికార తెలంగాణ రాష్ట్రసమితి (టీఆర్ఎస్)తో జత కడితే కాంగ్రెస్‌ బలపడే అవకాశం ఉంటుందని బీజేపీ అధిష్ఠానం అంచనా వేస్తున్నది. కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ దిశగా నడిచే అవకాశం ఉండదని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. టీఆర్ఎస్‌తో బీజేపీ తలపడగల సామర్థ్యాన్ని, దాని బలాన్ని బట్టే కాంగ్రెస్ పార్టీ విజయ అవకాశాలు ఆధారపడి ఉంటాయని చెప్పాయి. కాంగ్రెస్‌ పార్టీ బలపడకుండా చేసేందుకు తెలంగాణ విమోచన దినోత్సవం సెప్టెంబర్‌ 17ను అధికారికంగా నిర్వహించడం లేదనీ బీజేపీ భావిస్తున్నది. మైనార్టీ ఓట్లను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్‌ కూడా ఆ విషయంలో సీఎం కేసీఆర్‌పై ఒత్తిడి చేసే పరిస్థితి లేదని పేర్కొంటున్నారు. తమ పార్టీకి అలాంటి అడ్డంకులేమీ లేనందు రజాకార్ల అంశం, ముస్లిం రిజర్వేషన్లు, సెప్టెంబర్‌ 17న జాతీయ పతాకావిష్కరణ, కుటుంబ పాలన వంటి అంశాలను ఆయుధాలుగా చేసుకొని కాంగ్రెస్‌ స్థానాన్ని ఆక్రమించడానికి దండిగా అవకాశాలున్నట్లు బీజేపీ నాయకులు చెబుతున్నారు.

భవిష్యత్ లో సీపీఎంవైపు మైనారిటీలు

భవిష్యత్ లో సీపీఎంవైపు మైనారిటీలు

కేరళలో ప్రస్తుతం జరుగుతున్న హింసాత్మక ఘటనల కారణంగా ప్రజల దృష్టి సీపీఎం, బీజేపీపైనే కేంద్రీకృతమైన నేపథ్యంలో 2019 లోక్‌సభ ఎన్నికల నాటికి అక్కడ కాంగ్రెస్‌ పాత్ర చాలా వరకు కుంచించుకుపోయే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సీపీఎం దేశంలో ఎక్కడ అధికారం పోగొట్టుకున్నా హింసాత్మక చర్యలే కారణమయ్యాయనీ, ఇప్పుడు కేరళలో ఆ పార్టీకి అదే పరిస్థితి రాబోతోందని విశ్లేషిస్తున్నారు. కాంగ్రెస్‌ ప్రధాన ఓటుబలం మైనార్టీలేనని, అది బీజేపీ వ్యతిరేక ఓటు బ్యాంకు తప్పితే కాంగ్రెస్‌ సొంతబలం కాదని చెబుతున్నారు. కేరళలో బీజేపీ విస్తరించేకొద్దీ కాంగ్రెస్‌ పక్షాన ఉన్న మైనార్టీ ఓటర్లు సీపీఎం వైపు మళ్లుతారు కాబట్టి కాంగ్రెస్‌ ఉనికి కోల్పోయే అవకాశం ఉంటుందని భావిన్నారు.

అధికారంలో ఉన్నా కాంగ్రెస్ పార్టీకి నేతలు కరువు

అధికారంలో ఉన్నా కాంగ్రెస్ పార్టీకి నేతలు కరువు

కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీకి నాయకత్వ లేమి కారణంగా తమకు అడ్డంకులు ఉండబోవని బీజేపీ భావిస్తోంది. ఒకవేళ సిద్ధరామయ్య ప్రాంతీయ ఉద్యమాలు రెచ్చగొట్టేందుకు యత్నించినా ప్రాంతీయ పార్టీల మాదిరిగా తెగే దాకా లాగేస్థాయికి చేర్చలేరని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇటీవలి కాలంలో అక్కడ తలెత్తిన హిందీ వ్యతిరేక ఉద్యమం, లింగాయత్‌లను ప్రత్యేక మతంగా గుర్తించాలన్న డిమాండ్‌లు భవిష్యత్‌లో కనుమరుగవుతాయని భావిస్తున్నారు. యడ్యూరప్పను ముందే సీఎం అభ్యర్థిగా ప్రకటించడం వల్ల బీజేపీలో నాయకత్వం కేంద్రీకృతమై మరింత తీవ్రంగా ముందుకెళ్లేందుకు అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. గమ్మత్తేమిటంటే గాలి జనార్దన రెడ్డి మొదలు ఎడ్యూరప్ప, సదానందగౌడ తదితరులు మైనింగ్ కుంభకోణంలో చిక్కుకున్నవారే. కానీ ఆ కేసుల విచారణ ఇంకా పూర్తి కానేలేదు. ఆ కేసులో ప్రాథమిక సాక్షాధారాలు ఉన్నందునే సీఎంగా యెడ్యూరప్ప వైదొలిగారన్న సంగతి అందరికీ తెలుసు, కానీ ఆ విషయమేమీ తెలియదని, అవినీతి కేసులో తనను ఆయనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలని ఏసీబీ ఒత్తిడి చేస్తున్నారని ఒక అధికారి మీడియా ముందుకు వచ్చారు. యెడ్యూరప్ప తనకు వ్యతిరేకంగా ప్రజల్లో కుట్ర చేయాలని భావిస్తున్నారని ఆరోపణలకు దిగారు. అవినీతిలో చిక్కుకున్నతమ వారు సచ్చీలురని, అనవసర అభాండాలు వేస్తున్నారని చెప్పే కమలనాథులు.. విపక్షాల మీద ఆరోపణలు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. అందులో భాగంగా బీహార్ రాష్ట్రంలో ప్రజాతీర్పును తోసి రాజని ఆ రాష్ట్ర సీఎం నితీశ్ కుమార్ తనతో కష్టకాలంలో చిక్కుకున్న లాలూ ప్రసాద్ యాదవ్ ను లేని ఆరోపణలు గుప్పించి కుట్ర పూరితంగా వ్యవహరించి తప్పించిన ఘనత కమలనాథులది.

ప్రియాంక వచ్చినా నో యూజ్

ప్రియాంక వచ్చినా నో యూజ్

కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీయే ఆ పార్టీకి స్పీడో మీటర్‌గా తయారైనట్లు బీజేపీ నాయకులు చెబుతున్నారు. సోనియాగాంధీ కూతురు ప్రియాంకాగాంధీని తేవాలనుకున్నా ఫలితం ఉండదనీ, పరిస్థితులు చేయిదాటి పోయాయని పేర్కొంటున్నారు. కాంగ్రెస్‌ కేవలం మైనార్టీలపై ఆధారపడి మెజార్టీ ఓటర్లను దూరం చేసుకుందనీ, ఇప్పుడు జవజీవాలు నింపడం సాధ్యం కాదని వ్యాఖ్యానిస్తున్నారు. గాంధీయేతర కుటుంబీకుల చేతుల్లోకి పార్టీ వెళ్తే పరిస్థితి ఏమిటనేదీ చెప్పడం కష్టమంటున్నారు.

ప్రధానిమోదీ, బీజేపీ అధ్యక్షుడు షా.. తేలిగ్గా విడిచిపెట్టరు

ప్రధానిమోదీ, బీజేపీ అధ్యక్షుడు షా.. తేలిగ్గా విడిచిపెట్టరు

ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీజేపీ అమిత్ షా నాయకత్వ ద్వయం ప్రత్యర్థులకు అంత సులభంగా అవకాశం ఇవ్వదని బీజేపీ నేతలు అభిప్రాయ పడుతున్నారు. ఎక్కడైనా చివరి క్షణందాకా పోరాడటమే వీరి లక్ష్యమంటున్నారు. గుజరాత్‌లో రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నేత అహ్మద్‌పటేల్‌ గెలిచినా అసెంబ్లీ ఎన్నికలనాటికి కోలుకోలేని విధంగా ఆ పార్టీని దెబ్బతీసినట్లు వివరించారు. అమిత్‌షా తన రాజకీయ జీవితాన్ని ఫణంగా పెట్టి తన గెలుపునకు కావాల్సిన 46 ఓట్లను మాత్రమే అట్టిపెట్టుకొని అహ్మద్‌ను ఓడించేందుకు పథకం రచించారని తెలిపాయి. ప్రధానమంత్రి మోదీ ఫోన్‌చేసి మరీ ఇంత ప్రమాదకరమైన ఆటేంటి? ఒకవేళ నువ్వు ఓడిపోతే తాను ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పినా వినకుండా అమిత్‌షా ముందుకుసాగారని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి. ప్రతిరాష్ట్రంలో ఇదేతరహా వ్యూహాలు అమలు చేస్తూ ముందుకు సాగుతామని కమలనాథులు అంటున్నారు.

ఎన్నికల వరకు ఏపీలో ఇదే సస్సెన్స్ కొనసాగింపు

ఎన్నికల వరకు ఏపీలో ఇదే సస్సెన్స్ కొనసాగింపు

ఆంధ్రప్రదేశ్‌లో అధికార తెదేపాతో కొనసాగాలా? వద్దా? అనేదానిపై బీజేపీ తన మనసులో మాటను బయట పెట్టడం లేదు. 2019 ఎన్నికల నాటికి ఎవరు బలంగా ఉన్నారనేదానికి అనుగుణంగా అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందన్న భావనను వ్యక్తం చేస్తున్నారు. తెదేపాతో తెగదెంపులు చేసుకున్నా వేలెత్తి చూపే అవకాశం ఉండదనీ, ఎందుకంటే 2004 ఎన్నికల తర్వాత ఆ పార్టీ తమను విడిచిపెట్టి పోయిందని ఉదహరిస్తున్నారు. 2019 నాటికి అప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని బట్టి.. అప్పుడేం చేయాలన్నది ఆలోచిస్తామంటున్నారు. ప్రస్తుతానికి తెదేపాతో పొత్తులు ఉండవని చెప్పడంలేదనీ, రాజకీయాల్లో ఎప్పుడూ ఒకే సూత్రం వర్తించదని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బీజేపీ నేతలు రెండుగా చీలిపోయారు. ఒక వర్గం చంద్రబాబు నాయుడికి దన్నుగా ఉంటే, మరో వర్గం ఆయన ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నిస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదా మొదలు జాతీయ హోదా గల ప్రాజెక్టు ‘పోలవరం' పూర్తి విషయమై కేంద్రం అనునిత్యం దాటవేత వ్యూహం అమలుజేస్తూ వస్తున్నది. వాస్తవంగా పోలవరం ప్రాజెక్టు కేంద్రమే నిర్మించాలి. కానీ ఆ బాధ్యత ఏపీ సీఎం చంద్రబాబు తలకెత్తుకున్నారు. వచ్చే ఎన్నికల్లోగా ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానిదే మరి. ఈ ప్రాజెక్టు నిర్మాణం మొదలు హోదా తదితర అంశాలపై అధికార తెలుగుదేశం పార్టీ ప్రజల ముందు దోషిగా నిలబడుతుందా? పై చేయి సాధిస్తుందా? అన్న విషయమై అనిశ్చితి తొలిగితే ఏపీలో పొత్తు ఎవరితోనన్న సంగతి తేలనున్నది.

అన్నాడీఎంకే దన్నుతో ఇలా ఎదుగుదలకు బీజేపీ వ్యూహం

అన్నాడీఎంకే దన్నుతో ఇలా ఎదుగుదలకు బీజేపీ వ్యూహం

తమిళనాడు రాజకీయాల్లో బలపడటానికి దండిగా అవకాశాలున్నట్లు భాజపా నాయకులు అంచనా వేస్తున్నారు. 60 ఏళ్లు పైబడిన డీఎంకే నేత స్టాలిన్‌ ఇప్పటివరకూ సొంతంగా ఒక్క పోరాటంలోనూ గెలిచిన దాఖలా లేదని ఉదహరిస్తున్నారు. ఏఐఏడీఎంకే మనుగడ తమపైనే ఆధారపడి ఉండటం వల్ల దానిని ఎలాగైనా ఉపయోగించుకోవచ్చని బీజేపీ ధీమాగా ఉంది. తమిళుల ప్రాంతీయ అభిమానాన్ని అందిపుచ్చుకోవడంలోనూ తమకు ఎలాంటి అడ్డంకులు ఉండబోవని భావిస్తున్నారు. ప్రస్తుతం ఏఐఏడీఎంకే రాజకీయాల్లో బీజేపీ నేతలు వేలు పెడుతున్నారన్న అపవాదు వచ్చినా, దీర్ఘకాలం ప్రయోజనాలతో అక్కడి అవకాశాలను ఉపయోగించుకోవడానికి సంకోచించబోమంటున్నారు. తమిళనాడులో పార్టీకి కేడర్‌ బలం అంతగా లేకపోయినా ప్రధాని మోదీకి కేరళకంటే అక్కడే ఎక్కువ ఆదరణ ఉందనీ, అదే బీజేపీకి ప్రధాన బలంగా మారుతుందని చెబుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+