ముచ్చటగా మూడోసారి- దేవేంద్రుడి శకారంభం: వేదికపై చంద్రబాబు
New Maharashtra CM: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ బాధ్యతలను అందుకోవడం ఆయనకు ఇది మూడోసారి. తొలి విడతలో పూర్తికాలం పాటు ముఖ్యమంత్రిగా పని చేశారు. రెండో విడతలో అయిదు రోజులు మాత్రమే ఈ హోదాలో కొనసాగారు.
ఇప్పుడు మూడోసారి మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించారు. మహాయుటి కూటమి నేతలు ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణం చేశారు. ముంబై ఆజాద్ మైదాన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్ (ఉత్తరప్రదేశ్), భజన్ లాల్ శర్మ (రాజస్థాన్), మోహన్ యాదవ్ (మధ్యప్రదేశ్), విష్ణు దేవ్ సాయ్ (ఛత్తీస్గఢ్), ప్రమోద్ సావంత్ (గోవా), హిమంత బిశ్వ శర్మ (అస్సాం), మోహన్ చరణ్ మాఝీ (ఒడిశా), భూపేంద్ర పటేల్ (గుజరాత్), చంద్రబాబు నాయుడు (ఏపీ), నితీష్ కుమార్ (బిహార్), పలువురు కేంద్రమంత్రులు హాజరయ్యారు.

సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన 145 సీట్ల సంఖ్యా బలం బీజేపీకి లేదు. 149 సీట్లల్లో పోటీ చేసి 132 చోట్ల గెలిచిందీ పార్టీ. షిండే వర్గం శివసేన 81 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టగా 57 మంది గెలుపొందారు. అజిత్ వర్గానికి చెందిన ఎన్సీపీ మొత్తం 59 స్థానాల్లో పోటీ చేయగా 41 సీట్లు ఈ పార్టీ ఖాతాలో పడ్డాయి.












Click it and Unblock the Notifications