మాస్కులు తప్పనిసరి- డీజీసీఏ కీలక నిర్ణయం : లేకుంటే బోర్డింగ్ వద్దే..!!
దేశ వ్యాప్తంగా కోవిడ్ కేసులు క్రమేణా పెరుగుతున్నాయి. దాదాపు మూడు నెలల తరువాత భారీ సంఖ్యలతో కేసులతో పాటుగా మరణాలు నమోదయ్యాయి. దీంతో..కేంద్రం అప్రమత్తమైంది. కేసులు నమోదు ఆధారంగా అయిదు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఇదే సమయంలో డీజీసీఏ కీలక నిర్ణయం తీసుకుంది. మాస్కు ధరించని ప్రయాణికులను బోర్డింగ్ అయ్యే ముందే నిలిపేయాలని మార్గదర్శకాలు జారీ చేసింది. మాస్క్ లేకుండా విమానాశ్రయంలోకి ప్రయాణికులను అనుమతించవద్దని సీఐఎస్ఎఫ్కు మార్గదర్శకాలు పంపింది.
ఒకవేళ లోపలికి వచ్చినా.. బోర్డింగ్ అవ్వకుండా వెనక్కి పంపాలని సూచించింది. ప్రయాణ సమయంలోనూ తప్పకుండా మాస్కు ధరించాలని నిర్దేశించింది. కొవిడ్ ఉద్ధృతి కొనసాగుతున్న వేళ తాజా నిర్ణయం తీసుకుంది. దేశంలో కొన్ని ప్రాంతాల్లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో పాటు విమానయాన సిబ్బంది నుంచి ఫిర్యాదులు అందడం వల్ల ఈ చర్యలు తీసుకుంటున్నట్లుగా వెల్లడించింది. దీనికి సంబంధించి డీజీసీఏ మార్గదర్శకాలు జారీ చేసింది. గతంలో ఇచ్చిన సూచనలకు బదులుగా.. తాజాగా విడుదల చేసిన నిబంధనలు అమలు చేయాలని సర్క్యులర్ విడుదల చేసింది. ఫోర్త్ వేవ్ అని ప్రచారం సాగుతున్నా..నిపుణులు మాత్రం దానిని ఖండిస్తున్నారు.
భారత్ లో ఫోర్త్ వేవ్ వచ్చే అవకాశం లేదని తేల్చి చెబుతున్నారు. ఇప్పటికే రెండు వ్యాక్సిన్లు పూర్తి చేసిన వారి సంఖ్య దాదాపుగా 90 శాతానికి పైగా ఉండటంతో ఇక వ్యాప్తి సాధ్యం కాదని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో.. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశాల్లో కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్న నేపథ్యంలో డీజీసీఏ ఈ నిర్ణయం తీసుకుంది. డొమెస్టిక్ తో పాటుగా అంతర్జాతీయ ప్రయాణీకుల విషయంలోనూ ముందస్తు జాగ్రత్తలు అమలు చేస్తోంది. గతంలో కరోనా సమయంలో ప్రధానంగా విమాన సర్వీసుల పైనే ఎక్కువగా ప్రభావం పడింది. దీంతో..ఇప్పుడు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా డీజీసీఏ ఈ మార్గదర్శకాలను జారీ చేసింది.