చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్న డీజీసీఏ-బోయింగ్ లపై కీలక ఆదేశం..!
గుజరాత్ లోని అహ్మదాబాద్ లో నిన్న చోటు చేసుకున్న ఎయిర్ ఇండియా బోయింగ్ డ్రీమ్ లైనర్ విమాన ప్రమాదం తర్వాత దేశంలో ఇంకా నడుపుతున్న ఇలాంటి విమానాలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. గతంలో పలుమార్లు ఇలాంటి విమర్శలే వచ్చినా చిన్నపాటి చర్యలతో సరిపెట్టి ఇంకా వాటిని కొనసాగిస్తున్న డీజీసీఏ .. ఇప్పుడు నిన్నటి ఘటనతో మేల్కొంది. దేశ చరిత్రలోనే ఎన్నడూ లేనంత దారుణంగా 265 మందిని బలితీసుకున్న ఈ ఘటనతో డీజీసీఏ అప్రమత్తమైంది.
ప్రస్తుతం దేశంలో పనిచేస్తున్న ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8/9 సిరీస్ లోని అన్ని విమానాల్లోనూ జూన్ 15 నుంచి భద్రతా తనిఖీలు చేపట్టాలని డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది. ఈ విమానాల్లో మెరుగైన భద్రతా తనిఖీలు చేపట్టనున్నట్లు పౌర విమానయాన శాఖ ప్రకటించింది. ఎయిర్ ఇండియా అహ్మదాబాద్-లండన్ విమాన ప్రమాదంలో ఒకరు తప్ప మిగతా వారందరూ మరణించిన నేపథ్యంలో అమెరికా తయారీ బోయింగ్ 787 డ్రీమ్లైనర్ విమానాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ నేపథ్యంలో బోయింగ్ డ్రీమ్ లైన్ విమానాల్లో ఇంధనం, ఇంజిన్, హైడ్రాలిక్ వ్యవస్థల్ని తనిఖీ చేయాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో అధికారులు రంగంలోకి దిగారు. తనిఖీల తర్వాత అధికారులు ఇచ్చే నివేదిక ఆధారంగా డీజీసీఏ తుది నిర్ణయాలు తీసుకునేందుకు సిద్దమవుతోంది. తాజా తనిఖీల్లో ఇంధన పారామీటర్ల పర్యవేక్షణ , సంబంధిత సిస్టమ్ తనిఖీల తనిఖీ, క్యాబిన్ ఎయిర్ కంప్రెసర్ , సంబంధిత సిస్టమ్ల తనిఖీ, ఎలక్ట్రానిక్ ఇంజిన్ కంట్రోల్ సిస్టమ్ పరీక్ష, ఇంజిన్ ఇంధనంతో నడిచే యాక్యుయేటర్-ఆపరేషనల్ టెస్ట్ , ఆయిల్ సిస్టమ్ తనిఖీ, హైడ్రాలిక్ సిస్టమ్ సర్వీస్బిలిటీ చెక్, టేకాఫ్ పారా మీటర్ల సమీక్ష ఉండబోతోంది.
వీటితో పాటు రెండు వారాల్లోపు విమానాల్లో విద్యుత్ వ్యవస్ధల తనిఖీలు కూడా ఉంటాయని డీజీసీఏ వర్గాలు తెలిపాయి. అలాగే ఫ్లైట్ కంట్రోల్ తనిఖీ కూడా చేయనున్నారు. 15 రోజులలో బోయింగ్ డ్రీమ్లైనర్ విమానాలలో పునరావృతమయ్యే లోపాలను వీలైనంత త్వరగా సమీక్షించాలని కేంద్రం ఇచ్చిన ఆదేశాల్లో పేర్కొంది.












Click it and Unblock the Notifications