టీపై వెనక్కి పోం: డిగ్గీ, కిరణ్ రెడ్డి వ్యాఖ్యలపై నో కామెంట్
న్యూఢిల్లీ: తెలంగాణపై కాంగ్రెసు వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ పార్టీ వైఖరిని మరోసారి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సిడబ్ల్యుసి తీసుకున్న నిర్ణయం నుంచి వెనక్కి తగ్దేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించడానికి ఆయన నిరాకరించారు.
అన్ని పార్టీలతో చర్చించిన తర్వాతనే రాష్ట్ర విభజనకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. తాము తీసుకున్న నిర్ణయం నుంచి తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు, బిజెపికి వెనక్కి పోవచ్చు గానీ కాంగ్రెసు పార్టీ వెనక్కి వెళ్లదని ఆయన అన్నారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెసు తన నిర్ణయం నుంచి వెనక్కి తగ్దదని ఆయన అన్నారు. అన్ని పార్టీలతో చర్చించిన తర్వాతనే రాష్ట్ర విభజనకు నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు.
పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని సీమాంధ్ర, తెలంగాణ నాయకులు హైదరాబాదులో చెప్పినట్లు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలపై మీడియా వార్తలను బట్టి స్పందించలేనని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి ఏం మాట్లాడారనే విషయాన్ని పరిశీలించాల్సి ఉందని, రికార్డులు చూడాల్సి ఉందని, అవి చూసిన తర్వాతనే తాను మాట్లాడుతానని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మూడు ప్రాంతాలకు ముఖ్యమంత్రి అని ఆయన మరోసారి అన్నారు. విభజన జరిగే వరకు కిరణ్ కుమార్ రెడ్డే ముఖ్యమంత్రి అని ఆయన అన్నారు. దిగ్విజయ్ సింగ్ను తెలంగాణ ప్రాంతానికి చెందిన రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కలిశారు. సిడబ్ల్యుసి తీర్మానాన్ని అమలు చేస్తామని ఆయన చెప్పారు.