ముందు రోజే మృతి: జయలలిత మృతిపై బాంబు పేల్చిన శశికళ సోదరుడు, ఏం జరిగింది!?
చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై మరో వివాదం చెలరేగింది. మన్నార్ గుడిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె నెచ్చెలి శశికళ సోదరుడు దివాకరన్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
జయలలిత డిసెంబర్ 4వ తేదీన సాయంత్రం ఐదుంపావు గంటలకు మృతి చెందారని చెప్పారు. కానీ ఆమె మరణాన్ని 24 గంటల అనంతరం అపోలో ఆసుపత్రి సిబ్బంది ప్రకటించిందని సంచలన ఆరోపణలు చేశారు.

బాంబు పేల్చిన శశికళ సోదరుడు
జయలలిత డిసెంబర్ 4వ తేదీనే మృతి చెందారని శశికళ సోదరుడు బాంబు పేల్చారు. అపోలో ఆసుపత్రి మాత్రం డిసెంబర్ 5న రాత్రి 9 గంటలకు మరణించినట్లు పోస్టుమార్టం రిపోర్టులో పేర్కొన్నారని ఆరోపించారు.

అపోలో ఆసుపత్రిపై ఇలా
దేశవ్యాప్తంగా ఉన్న అపోలో ఆసుపత్రులన్నింటి వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసిన తర్వాతే తాము అమ్మ జయలలిత మృతి చెందినట్లు ప్రకటిస్తామని ఆసుపత్రి వర్గాలు చెప్పాయని దివాకరన్ అన్నారు.

అపోలో ఆసుపత్రి వివరణ
అయితే, దివాకరన్ ఆరోపణలపై అపోలో ఆసుపత్రి వర్గాలు స్పందించాయి. జయలలిత 4వ తేదీన మృతి చెందిందనే ఆరోపణలు అవాస్తవమని చెప్పారు. ఆమె డిసెంబర్ 5నే మృతి చెందారని మరోసారి స్పష్టం చేశారు. ముందురోజు చనిపోయిందని చెప్పిన దాంట్లో వాస్తవం లేదన్నారు.

దివాకరన్ చెప్పింది నిజమా
ఇదిలా ఉండగా శశికళ సోదరుడు దివాకరన్ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. దివాకరన్ చెప్పింది నిజమే అయితే అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై ప్రకటన చేయకుండా శశికళ ఆపారా లేక అపోలో వర్గాలే ఆపాయా అనే చర్చ సాగుతోంది.












Click it and Unblock the Notifications