సెక్స్ టెస్టులు చేయిస్తూ..! అడ్డంగా బుక్కయిన ఇద్దరు భర్తలు
ముంబై : మగపిల్లలే కావాలనే ఛాందసత్వం.. ఆడపిల్ల పుట్టడానికే భార్యే కారణమన్న భర్తల మూర్ఖత్వం దేశంలో చాలామంది మహిళలను వేధింపులకు గురిచేస్తోంది. ఈ క్రమంలో పిల్లలను కనే ఓ మెషీన్ లాగా మారిపోతున్న మహిళలు.. భర్తలు చెప్పిందల్లా చేయడం తప్ప ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో బ్రతుకుతున్నారు.
తాజాగా మగపిల్లలే కావాలని పట్టుబడి కడుపులో ఉన్న బిడ్డలకు లింగ నిర్ధారణ పరీక్షలు చేయిస్తూ అడ్డంగా బుక్కయ్యారు మహారాష్ట్రలోని భిగ్వాన్ కు చెందిన ఇద్దరు భర్తలు. వివరాల్లోకి వెళ్తే.. సునీత విలాస్ అనే మహిళకు ముగ్గురు ఆడపిల్లలు కాగా ఆమె భర్త మగపిల్లాడి కోసం పోరు పెడుతున్నాడు. ఐదుగురు ఆడపిల్లలకు తల్లి అయిన మరో వివాహిత బలికా పోపత్ ది కూడా ఇదే పరిస్థితి.
మగపిల్లాడి కోసం కుటుంబ నియంత్రణకు కూడా ఒప్పుకోని సదరు భర్తలు.. భార్యలను గర్భవతులను చేయడమే పనిగా పెట్టుకున్నారు. తాజాగా ఇద్దరు మళ్లీ గర్బం దాల్చడంతో.. కడుపున పడ్డ బిడ్డ మగా.. ఆడా .. అన్న లింగ నిర్ధారణ చేయడానికి సిద్దమయ్యారు. అయితే లింగ నిర్ధారణలు చట్ట విరుద్దం కాబట్టి.. కనీస అర్హతలు కూడా లేని ఓ నలుగురు డాక్టర్లతో నడిరోడ్డు పక్కనే, పార్కు చేసి ఉన్న ఓ కారులో లింగ నిర్ధారణ పరీక్షలు చేయించారు.
సోనగ్రఫీ మెషీన్లు, ఒక చిన్న ల్యాప్ టాప్ తో సదరు వ్యక్తులు లింగ నిర్దారణ పరీక్ష చేస్తుండగా.. అటుగా వచ్చిన పోలీసులు అనుమానంతో కారు వద్దకు వచ్చి విషయంపై ఆరా తీశారు. దీంతో అసలు విషయం బయటపడింది. లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారని తేలడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే మగపిల్లాడు కోసం పోరు పెడుతోన్న సదరు భర్తలపై కూడా పోలీసులు కేసు నమోదు చేయడంతో.. ఇద్దరికీ శిక్ష పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.