సందేహమే: కాంగ్రెసులో తెరాస విలీనంపై సస్పెన్షన్
హైదరాబాద్: కాంగ్రెసులో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) విలీనంపై సస్పెన్స్ కొనసాగుతోంది. తెరాస విలీనంపై సందేహాలు కూడా తలెత్తుతున్నాయి. ఇరు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం ఆ విషయాన్ని తెలియజేస్తోంది. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావుకు బుధవారం హైదరాబాదులో భారీయెత్తున స్వాగతం లభించింది. దాంతో కెసిఆర్ తెలంగాణలో తన బలాన్ని నిరూపించుకున్నట్లయింది.
తెరాస విలీన ప్రక్రియకు సంబంధించి చర్చలు ముగిశాయి, సీట్ల పంపకం మాత్రమే ఉందని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ చెప్పిన వెంటనే తెరాస అధ్యక్షుడు కెసిఆర్ ఆ మాటలను ఖండిస్తూ ప్రకటన చేశారు. ఇది ఆదివారంనాడు జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం తెరాసను కెసిఆర్ తమ పార్టీలో విలీనం చేయాలని కాంగ్రెసు నేతలు కోరుతుండగా, కెసిఆర్ మరో విధంగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

తెరాస విలీనం విషయంలో దిగ్విజయ్ సింగ్ మరోసారి అవే మాటలు చెప్పారు. అయితే, తెరాస శాసనసభ్యుడు, కెసిఆర్ తనయుడు కెటి రామారావు ఆ మాటలకు తీవ్రంగా ప్రతిస్పందించారు. తమ పార్టీ విలీనం గురించి గానీ పొత్తు గురించి గానీ ఆలోచించడం లేదని అన్నారు.
ప్రస్తుత స్థితిలో కెసిఆర్ తన పార్టీని కాంగ్రెసులో విలీనం చేయకూడదనే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. తెలంగాణ పునర్నిర్మాణం పేరుతో తాను అధికారంలోకి రావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. తెరాసతో కనీసం పొత్తు పెట్టుకునైనా తెలంగాణలో తగిన సీట్లను సాధించుకోవాలనే తపనతో కాంగ్రెసు పార్టీ ఉంది. ప్రజారాజ్యం తరహాలోనే తెరాస వ్యవహరించే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.
కెసిఆర్కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి కాంగ్రెసు అధిష్టానం ముందుకు వచ్చిందని, అయితే ఆయన అంతకు మించి డిమాండ్ చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. విలీనం చేయాలంటే విస్తృతమైన చర్చలు జరగాల్సి ఉందని తెరాస నాయకుడొకరు అన్నారు. పార్టీని విలీనం చేయకపోతే ఎన్నికల తర్వాత కెసిఆర్ యుపిఎతో ఉంటాడనే గ్యారంటీ లేదనే అనుమానాలు కాంగ్రెసు నాయకుల నుంచి వ్యక్తమవుతున్నాయి.
విలీనంపై గానీ సీట్ల పంపకంపై గానీ కెసిఆర్ త్వరలో జరిగే పార్టీ పోలిట్బ్యూరో సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications