కట్నదాహానికి బలి.. గుండెల్ని పిండే వేదన..: టెకీ జాహ్నవి సూసైడ్ లెటర్..
'నాన్నా నాకు ఇంకో జన్మంటూ ఉంటే మీ కుమార్తెగానే పుట్టాలని దేవుడిని ప్రార్థిస్తున్నా. మమ్మీ, డాడీ, విగ్నేష్.. మీరంతా నన్ను మరచిపోయి ఎప్పటిలా నవ్వుతూనే ఉండాలి'.
అనంతపురం: ఓవైపు కామంతో కాటేసే కామాంధులు.. మరోవైపు కట్నదాహాంతో కాటేసే కాలనాగులు.. ఈ రెండు కారణాలు దేశంలో మహిళల రక్షణను రోజురోజుకు ప్రశ్నార్థకంగా మార్చేస్తున్నాయి.
ప్రాణం తీసిన కట్న దాహం: బెంగళూరులో మహిళా టెక్కీ ఆత్మహత్య
తాజాగా అత్తింటివారి అదనపు కట్న వేధింపులకు బెంగుళూరులో జాహ్నవి అనే వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.ఆత్మహత్యకు గల కారణాలను వివరిస్తూ.. జాహ్నవి రాసిన లేఖ తాజాగా వెలుగుచూసింది.
సూసైడ్ లెటర్ లో ఇలా..
'నాన్నా నాకు ఇంకో జన్మంటూ ఉంటే మీ కుమార్తెగానే పుట్టాలని దేవుడిని ప్రార్థిస్తున్నా. మమ్మీ, డాడీ, విగ్నేష్.. మీరంతా నన్ను మరచిపోయి ఎప్పటిలా నవ్వుతూనే ఉండాలి. మీరు నా గురించి ఏడవద్దు. సంతోషంగా ఉండాలి. నేను ఆకాశం నుంచి మిమ్మల్ని చూస్తూ ఉంటాను. ఇక సెలవ్' అంటూ లేఖలో హృదయవిదారకంగా జాహ్నవి తన చివరి మాటలను రాసింది.
మొత్తం 20పేజీల లేఖ ద్వారా మెట్టినింటిలో తాను ఎదుర్కొన్న కష్టాలన్నింటిని జాహ్నవి చెప్పుకొచ్చింది. ఈ లేఖ ప్రస్తుతం పోలీసులు ఆధీనంలో ఉంది.
సంబంధం ఇలా కుదిరింది:
రెండేళ్ల క్రితం జాహ్నవికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని సూర్యప్రతాప్రెడ్డి భావించారు. ఇదే క్రమంలో సంబంధాల కోసం అన్వేషిస్తుండగా నగరంలోని ఓ విద్యా సంస్థల అధినేత సమీప బంధువుల ద్వారా సాఫ్ట్ వేర్ విద్యాసాగర్ రెడ్డి సంబంధం వారి వద్దకు వచ్చింది. గతంలో తమకు పరిచయం ఉన్న కుటుంబం కావడంతో జాహ్నవి తల్లిదండ్రులు కూడా సంబంధానికి ఒప్పుకున్నారు.
అక్కడే.. తప్పటడుగు:
తెలిసినవారే కదా! అని నమ్మడం జాహ్నవి పాలిట శాపంగా మారింది. హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాని పరిచయం చేసుకున్న విద్యాసాగర్ రెడ్డి.. తనకు ఓ ప్రముఖ కంపెనీలో ఉద్యోగం వచ్చిందంటూ నకిలీ మెయిల్స్ క్రియేట్ చేసి జాహ్నవి కుటుంబాన్ని నమ్మించాడు.
అదీగాక.. పెళ్లికి ముందు విద్యాసాగర్ రెడ్డి తల్లి పదే పదే జాహ్నవికి ఫోన్లు చేసింది. నువ్వు లేకుంటే మావాడు బ్రతకనంటున్నాడు.. నిన్ను చూసినప్పటి నుంచి నిన్నే చేసుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు అని చెప్పేది.
ఈ మాటలన్ని విని.. నిజంగానే ఆ కుటుంబం తనను కంటికి రెప్పలా చూసుకుంటుందని జాహ్నవి భావించింది. అయితే వారి తీయటి మాటల వెనుక 'అదనపు కట్నం' అనే కర్కషత్వం ఉందని జాహ్నవి కుటుంబం గమనించలేకపోయింది.
జాహ్నవి కుటుంబాన్ని అవమానించి:
పని పాట లేకుండా ఖాళీగా ఉండే విద్యాసాగర్ రెడ్డి.. పుట్టినింటి నుంచి అదనపు కట్నం తీసుకురావాల్సిందిగా జాహ్నవిని వేధించాడు. బంధువులు కూడా అతనికి వంత పాడటంతో రూ.2కోట్ల నగదుతో పాటు ఓ ఇన్నోవా కారు, అనంతపురంలో నివాసాలు కొనివ్వాల్సిందిగా జాహ్నవి కుటుంబంపై ఒత్తిడి తెచ్చారు.
అదనపు కట్నం ఇవ్వలేకపోతున్నందుకు జాహ్నవి కుటుంబాన్ని నానా మాటలన్నారు. హేళన చేయడం, అవమానించడంతో జాహ్నవి మానసిక వేదనకు గురైంది.
ఫిర్యాదులతో లాభం లేక.. తనువు చాలించి..
కట్నం వేధింపులపై జాహ్నవి పోలీసులకు ఫిర్యాదు చేసినా లాభం లేకపోయింది. తెలిసిన పెద్దల పలుకుబడి ఉపయోగించుకుని విద్యాసాగర్ రెడ్డి కుటుంబం కేసును నిలబడనివ్వకుండా చేసేశారు.
దీంతో జాహ్నవి తీవ్ర మనోవేదనకు గురైంది. ఎవరి చుట్టూ తిరిగినా.. కౌన్సెలింగులు, పంచాయితీలతో సరిపెట్టడమే తప్పితే పెద్దగా లాభముండదని భావించింది. అత్తింటి వేదింపులతో కొద్దికాలంగా బెంగుళూరులోని తన సోదరి నివాసంలో ఉంటున్న జాహ్నవి మంగళవారం నాడు ఆత్మహత్య చేసుకుంది.