మూడు అడుగుల నీటిలోకి వైజాగ్ సహా 12 నగరాలు? ప్రపంచ బ్యాంక్ నివేదిక హెచ్చరిక..
ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న వాతావరణ మార్పులు భారత్ పైనా ప్రభావం చూపుతున్నాయి. వీటి కారణంగా సముద్ర మట్టాల పెరుగుదల, వరదలు, విపత్తులు తప్పడం లేదు. తాజాగా మిచౌంగ్ తుపాను ప్రభావంతో దక్షిణ భారత నగరమైన చెన్నై విలవిల్లాడుతోంది. చాలా చోట్ల మూడడుగుల లోతులోకి నగరం జారుకుంది. అయితే చెన్నై ఒక్కటే కాదు ఇలాంటి ముప్పు దేశంలోని మరో 11 నగరాలకు కూడా ఉందంటూ వరల్డ్ బ్యాంక్ తాజాగా ఇచ్చిన నివేదిక సంచలనం రేపుతోంది.
వరల్డ్ బ్యాంక్ గ్రూప్ నియమించిన పోట్స్డ్యామ్ ఇన్స్టిట్యూట్ ఫర్ క్లైమేట్ ఇంపాక్ట్ రీసెర్చ్ అండ్ క్లైమేట్ అనలిటిక్స్ పరిశోధన ప్రకారం భారతదేశం భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్నందున సముద్ర మట్టాల్లో పెరుగుదల తప్పదని హెచ్చరించింది. ఇది సముద్రతీర నగరాలకు ఉప్పునీటి ముంపు, వ్యవసాయంపై ప్రభావం, భూగర్భజలాల నాణ్యతను దిగజార్చడం, నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల పెరుగుదలకు దారి తీయడం వంటి ముప్పులకు కారణమవుతోందని హెచ్చరికలు జారీ చేస్తోంది.

2021లో వాతావరణ మార్పులపై నియమించిన అంతర్ ప్రభుత్వ కమిటీ ఐపీసీసీ (IPCC) నివేదికలో భారతదేశానికి తీవ్ర హెచ్చరికలు వచ్చాయి. ఈ శతాబ్ది చివరి నాటికి దేశంలోని 12 తీరప్రాంత నగరాలను ముంచెత్తే ప్రమాదమున్న సముద్ర మట్టాలు పెరగడం అత్యంత ప్రమాదకరమైన ప్రమాద కారకంగా ఉందని పేర్కొంది.ఇందులో ముంబై, చెన్నై, కొచ్చి, విశాఖపట్నం సహా డజను భారతీయ నగరాలు శతాబ్దం చివరి నాటికి దాదాపు మూడు అడుగుల నీటి అడుగున ఉండవచ్చని ఐపీసీసీ నివేదిక హెచ్చరించింది.
ఏడు మిలియన్లకు పైగా తీరప్రాంత వ్యవసాయం, మత్స్యకార కుటుంబాలు ఇప్పటికే ఈ ప్రభావాలను అనుభవిస్తున్నాయి. తీర కోత, పెరుగుతున్న సముద్ర మట్టాల వల్ల ఈ సమస్య నానాటికీ పెరుగుతోంది. 2050 నాటికి దాదాపు 1,500 చదరపు కిలోమీటర్ల భూమిని వీటి వల్ల కోల్పోయే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ కోత విలువైన వ్యవసాయ ప్రాంతాలను తినేస్తుందని, తీరప్రాంత సమాజాల ఉనికికే ముప్పు కలిగిస్తుందని అంచనా.
లోతట్టు తీర ప్రాంతాలు, నది డెల్టాలు వరదలకు ఎక్కువగా అవకాశం కలిగి ఉండటం వలన భారతీయ తీరప్రాంత మండలాల దయనీయ స్ధితి ఇక్కడ చర్చనీయాంశమవుతోంది. ముంబై, కోల్కతా , చెన్నై, వాటి జనసాంద్రత,మౌలిక సదుపాయాలతో మరింత తరచుగా తీవ్రమైన వరదల ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. ఇది మిలియన్ల మందిని నిరాశ్రయుల్ని చేస్తుందని అంచనా. అలాగే వారి జీవనోపాధి, మౌలిక సదుపాయాలపై ప్రభావం చూపుతోంది. వాతావరణ మార్పుల కారణంగా వరదలు వచ్చే ప్రమాదం కేవలం తీరప్రాంత నగరాలకు మాత్రమే కాదని, బీహార్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లోని నగరాలపైనా ప్రభావం చూపుతాయని తాజా నివేదికలు హెచ్చరిస్తున్నాయి.












Click it and Unblock the Notifications