బొందుగాళ్లు వ్యాఖ్యలు ముమ్మాటికి తప్పే, మరోసారి రిపిట్ కాకుండా చూసుకొండి : కేసీఆర్కు ఈసీ వార్నింగ్
న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన 'హిందుగాళ్లు బొందుగాళ్లు' కామెంట్ పై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. హిందువులకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికి తప్పేనని స్పష్టంచేసింది. ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన కిందకే వస్తోందని పేర్కొంది.
చిచ్చు సరికాదు
ఓట్ల కోసం కుల, మతాల మధ్య చిచ్చుపెట్టినట్టుగా పరిగణిస్తున్నామని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. మొదటిసారి కాబట్టి హెచ్చరించి వదిలేస్తున్నామని వెల్లడించింది. భవిష్యత్ లో మళ్లీ ఇలాంటి ఘటన రిపీట్ కాకుండా చూసుకోవాలని హెచ్చరించింది. దీనికి సంబంధించి కాసేపటి క్రితం ఈసీ ఓ సర్క్యులర్ జారీచేసింది. అయితే ఈసీ హెచ్చరికలపై కేసీఆర్, టీఆర్ఎస్ నేతలు స్పందించాల్సి ఉంది.
బొందుగాళ్లు కామెంట్స్
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సీఎం కేసీఆర్ కరీంనగర్ నుంచి ప్రచార శంఖారావం పూరించారు. అక్కడ ఏర్పాటుచేసిన బహిరంగ సభలో బీజేపీని ఉద్దేశించి 'హిందుగాళ్లు బొందుగాళ్లు‘ అని కామెంట్ చేశారు. బీజేపీ నేతలు గుళ్లు, గోపురాలు తిరుగుతరా ? మిగతావారు ఆలయాలకు వెళ్లారా అని ప్రశ్నించారు. మేం తిరుపతి, ఎములాడ వెళ్లమా ... వాళ్లేనా హిందుగాళ్లు బొందుగాళ్లు అని వ్యాఖ్యానించారు.
కంప్లైంట్ .. వివరణ ... వార్నింగ్
కేసీఆర్ వ్యాఖ్యలను తప్పుపడుతూ ఆరెస్సెస్ నేత ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనిపై సీఎం కేసీఆర్ ను వివరణ కోరగా .. లిఖితపూర్వకంగా ఎక్స్ ప్లానేషన్ కూడా ఇచ్చారు. అయితే ఆయన వివరణతో సంతృప్తి చెందని ఈసీ .. కేసీఆర్ కు వార్నింగ్ ఇచ్చింది. బొందుగాళ్లు వ్యాఖ్యలు తప్పని .. మరోసారి రిపీట్ కానియొద్దని తేల్చిచెప్పింది.