తబ్లీగీజమాత్ సంస్థపై ఈడీ దాడుల కలకలం .. మనీ లాండరింగ్ లావాదేవీలపై దేశ వ్యాప్తంగా సోదాలు
దేశవ్యాప్తంగా తబ్లీగీ జమాత్ సంస్థపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహించడం కలకలం రేపింది. తబ్లీగీ జమాత్ సంస్థపై నమోదైన మనీ ల్యాండరింగ్ కేసులో ఈడి ఏకకాలంలో వేర్వేరు ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించింది. తబ్లీగీ జమాత్ సంస్థ చీఫ్ మౌలానా సాద్ కంధల్విపై ఈ ఏడాది ఏప్రిల్లో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసు ఆధారంగా ఈడీ రంగంలోకి దిగి విచారణ చేపట్టింది.
Recommended Video

తబ్లీగీ సంస్థ దేశ వ్యాప్త కార్యాలయాలపై ఈడీ దాడులు
ఢిల్లీ, ముంబై, కేరళ తో పాటుగా, హైదరాబాద్ లోని నాలుగు చోట్ల తబ్లీగీ జమాత్ సంస్థ కార్యాలయాలలో ఈడీ అధికారులు సోదాలు చేశారు.
తబ్లీగీ జమాత్ ... ఈ పేరు తెలియని ఇండియన్స్ బహుశా ఉండరు . ఈ పేరు వినగానే భారతదేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరగడానికి కారణమైన సదస్సు నిర్వహించిన ఒక ఇస్లామిక్ మతపరమైన సంస్థ అన్నది అందరికీ గుర్తుకు వస్తుంది. భారతదేశంలో కరోనా కేసులు అప్పుడప్పుడే నమోదవుతున్న వేళ తబ్లీగీ జమాత్ నిర్వహించిన సదస్సు భారతదేశం మొత్తం కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి కారణమైంది అన్న చర్చ అప్పట్లో సాగింది.

ఇండియాలో కరోనా వ్యాప్తికి కారణం అయిన తబ్లీగీ సదస్సు
ఈ సదస్సు నిర్వహించకపోయిఉంటే ఇండియాలో కరోనా వ్యాప్తి ఇంతగా ఉండేది కాదు అన్నది చాలా మంది అభిప్రాయం.
కరోనా వైరస్ వ్యాప్తికి కారణమైన తబ్లీగీజమాత్ దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమైంది. కరోనా లాక్డౌన్ కొనసాగుతున్న సమయంలో ఢిల్లీలో నిర్వహించిన ఈ సదస్సు అధికారుల నిఘా వైఫల్యాన్ని స్పష్టంగా చెబుతుందని పలు విమర్శలు వెల్లువెత్తాయి. ఇక ఇదే సమయంలో తబ్లీగీ జమాత్ కార్యకలాపాలపైన పెద్ద ఎత్తున చర్చ సాగింది.

మనీలాండరింగ్ తో పాటుగా, హవాలా ద్వారా డబ్బు లావాదేవీలపై దర్యాప్తు
ప్రపంచ దేశాల నుండి పెద్ద ఎత్తున విరాళాలు తబ్లీగీ జమాత్ కు అందుతున్నాయని, ఆ నిధుల దుర్వినియోగం జరుగుతోందని ఆ సంస్థ కార్యకలాపాలపై పోలీసులకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అంతేకాదు మనీలాండరింగ్ తో పాటుగా, హవాలా ద్వారా డబ్బు లావాదేవీలు జరిగినట్లుగా ఫిర్యాదులు అందడంతో ఈడీ రంగంలోకి దిగింది. తాజాగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దేశ వ్యాప్తంగా ఉన్న తబ్లీగీ కార్యాలయాలపై సోదాలు నిర్వహించింది.

సోదాలలో కీలక అంశాలు .. కొనసాగుతున్న ఈడీ దర్యాప్తు
ఈ సోదాలలో పలు కీలక విషయాలను గుర్తించినట్లుగా తెలుస్తుంది. నిబంధనలకు విరుద్ధంగా మర్కజ్ చీఫ్ మౌలానా సాద్ తో పాటుగా మరో నలుగురు తబ్లీగీ జమాత్ నిధులను సొంత ఖాతాలకు మళ్లించారని గుర్తించిన ఈడీ అధికారులు వారిపై కేసు నమోదు చేశారు.మనీలాండరింగ్ నివారణ చట్టం (పిఎంఎల్ఎ) కింద తబ్లీగీ జమాత్ సంస్థపై చర్య తీసుకుంటున్నట్లు ఈడి తెలిపింది. ఇంకా ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతుంది.












Click it and Unblock the Notifications