ఈవ్ టీజింగ్: కాలేజ్ విద్యార్థిని బలి
ముంబై: వెంటపడి పదే పదే వేధించడంతో తట్టుకోలేక కాలేజ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మహారాష్ట్రలో జరిగింది. యువతి ఆత్మహత్యకు కారణం అయిన యువకుడిని పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.
ఉత్తర మహారాష్ట్రలోని జల్ గాన్ జిల్లా లోని పచోరా పట్టణంలో 18 సంవత్సరాల యువతి డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నది. శరద్ పాటిల్ (26) అనే యువకుడు కాలేజ్ కు వెళుతున్న యువతిని వేధించడం మొదలు పెట్టాడు.
ఆమె ఎక్కడికి వెళ్లినా వెంబడించేవాడు. పదే పదే తన వెంట పడవద్దని యువతి శరద్ పాటిల్ కు మనవి చేసింది. తనకు ఇష్టం లేదని అతనికి నచ్చ చెప్పడానికి ప్రయత్నించింది. అయితే శరద్ పాటిల్ ఇంకా రెచ్చిపోయాడు. ఇటివల నడి రోడ్డు మీద యువతి శరీరం మీద ఎక్కడపడితే అక్కడ చేతులు వేశాడు.
అవమానం తట్టుకోలేని యువతి ఈ నెల 17వ తేదిన ఇంటిలో ఎలుకల మందు తాగింది. విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు యువతిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై యువతి మరణించిందని పోలీసులు అన్నారు. శరద్ పాటిల్ ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.