'జీఎస్టీ' సీఏలకే అర్థం కావట్లేదు.. ఇప్పటికైతే అంతుచిక్కడం లేదు: బీజేపీ ఎమ్మెల్యే
కేంద్రం సవరణలు ఎలా ఉన్నప్పటికీ.. జీఎస్టీని అర్థం చేసుకోవడంలో ఇప్పటికీ గందరగోళమే నెలకొన్నట్టు కనిపిస్తోంది.
Recommended Video
న్యూఢిల్లీ: ఈ ఏడాది జులైలో ప్రవేశపెట్టిన జీఎస్టీపై కేంద్ర ప్రభుత్వం తాజాగా పలు మార్పులు చేసింది. గతంలో 28శాతం పన్ను స్లాబులో వస్తువుల్లో చాలావాటిని ఇప్పుడు 18శాతం స్లాబులో చేర్చింది. ప్రస్తుతం 50వస్తువులు మాత్రమే 28శాతం పన్ను స్లాబులో ఉన్నాయి.
కేంద్రం సవరణలు ఎలా ఉన్నప్పటికీ.. జీఎస్టీని అర్థం చేసుకోవడంలో ఇప్పటికీ గందరగోళమే నెలకొన్నట్టు కనిపిస్తోంది. సొంత పార్టీ నేతల నుంచి ఈ విమర్శలు వినిపిస్తుండటం గమనార్హం. తాజాగా మధ్యప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే ఓం ప్రకాశ్ దుర్వే పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వివాదాస్పద జీఎస్టీ వ్యాపారులు, పన్ను నిపుణులే కాదు చివరికి సీఏలకూ అర్థం కావడం లేదని ప్రకాశ్ దుర్వే అన్నారు. జీఎస్టీని అర్థం చేసుకోవడానికి మరికొంత సమయం పడుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతానికైతే జీఎస్టీ ఎవరికీ అంతుచిక్కడం లేదని, ఒక్కసారి దీనిపై స్పష్టత వస్తే అంతా ఊపిరి పీల్చుకుంటారని తెలిపారు.
పరిశ్రమలకు జీఎస్టీ ఉపయోగపడుతుందని చెప్పారు. కాగా, ఈ ఏడాది జులై నుంచి అమల్లోకి వచ్చిన జీఎస్టీపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. జీఎస్టీకి తగ్గ నెట్ వర్క్ ను వ్యాపారులకు అందించకుండానే దాన్ని ప్రవేశపెట్టడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం వాటిల్లే ప్రమాదముందని ప్రతిపక్ష కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
గత లైసెన్స్ రాజ్ వ్యవస్థను గుర్తుకు తెచ్చేలా ప్రస్తుత జీఎస్టీ వ్యవస్థ ఉందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. బెంగాల్ సీఎం మమతా కూడా జీఎస్టీపై విమర్శలు సంధించారు. జీఎస్టీని ఆమె సెల్ఫిష్ టాక్స్ గా అభివర్ణించారు.