షాకింగ్: మార్చూరీ వ్యాన్ నిరాకరించడంతో శిశువు మృతదేహాన్ని బ్యాగులో తీసుకెళ్లిన పేరెంట్స్
భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్పూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. జబల్పూర్లోని ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసూతి కోసం చేరిన మహిలకు మగబిడ్డ జన్మించాడు. అయితే, ఆ శిశువు ప్రాణాలు దక్కలేదు. దీంతో ఆ శిశువును బాధితులు తమ వెంట తీసుకెళ్లేందుకు మార్చూరీ వాహనం అందుబాటులో ఉంచాల్సి ఉండగా.. ఆస్పత్రి సిబ్బంది కర్కశంగా వ్యవహరించారు.
ఆ మృత శిశువును ఓ బ్యాగులో పెట్టుకుని ప్యాసింజర్ బస్సులో వెళ్లాలని బాధితులపై ఆస్పత్రి సిబ్బంది ఒత్తిడి చేశారు. దీంతో చేసేదేం లేక ఆ శిశువు తండ్రి అలాగే చేశాడు. జూన్ 15న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

అయితే చిన్నారిని తల్లిదండ్రులు ఆస్పత్రి నుంచి బయటకు తీసుకెళ్ళే సమయంలో మగబిడ్డ బతికే ఉన్నాడని రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారి ఒకరు తెలిపారు. దిండోరి జిల్లాలోని సహజ్పురి గ్రామానికి చెందిన సునీల్ ధుర్వే, అతని భార్య జమ్నీ బాయి జూన్ 13న ప్రభుత్వ ఆస్పత్రిలో మగబిడ్డను ప్రసవించిందని, శిశువు బలహీనంగా ఉన్నందున, కేసును జబల్పూర్లోని ప్రభుత్వ వైద్య సదుపాయానికి రిఫర్ చేసినట్లు చెప్పారు.
'బిడ్డను జబల్పూర్లోని ప్రభుత్వ ఆధ్వర్యంలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేర్చారు, అక్కడ అతను జూన్ 15 న చికిత్స పొందుతూ మరణించాడు. అయితే ఆసుపత్రి, మృతదేహాన్ని నా స్వస్థలానికి తీసుకెళ్లడానికి మార్చురీ వాహనాన్ని అందించలేదు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా మృతదేహాన్ని బ్యాగ్లో పెట్టుకుని బస్సులో ప్రయాణించాల్సి వచ్చింది' అని సునీద్ ధుర్వే వాపోయాడు.
ఈ ఘటనపై రాష్ట్ర ఆరోగ్య శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సంజయ్ మిశ్రా మీడియాతో మాట్లాడుతూ.. జబల్పూర్లోని ప్రభుత్వ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినప్పుడు శిశువు బతికే ఉన్నాడని, డిండోరి జిల్లాలోని వైద్య శాల నుంచి శిశువును జబల్పూర్ ఆసుపత్రికి రిఫర్ చేసినట్లు ఆయన తెలిపారు.

'నవజాత శిశువు అడ్మిట్ చేసుకున్నాం. అతని చికిత్స ప్రారంభించాం. అయితే అతని తల్లిదండ్రులు తమ బిడ్డను డిశ్చార్జ్ చేయమని ఆస్పత్రికి అభ్యర్థించారు, అయితే శిశువు పరిస్థితి విషమంగా ఉన్నందున అలా చేయవద్దని వైద్యులు వారిని కోరారు' అని మిశ్రా చెప్పారు.
మృతులను తీసుకెళ్లేందుకు మార్చురీ వాహనాలు అందుబాటులో ఉన్నాయా? అని ప్రశ్నించగా.. ప్రభుత్వాసుపత్రిలో అలాంటి సౌకర్యం అందుబాటులో లేదన్నారు. కాగా, దిండోరి జబల్పూర్ నుండి 140 కి.మీ దూరంలో ఉంది.












Click it and Unblock the Notifications