5రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి షాక్ -కమలాన్ని ఓడించడానికి రైతుల టీమ్స్ -12నుంచే రంగంలోకి
వివాదాస్పద వ్యవసాయ చట్టాలు బీజేపీకి మరింత ఇబ్బందులు తెచ్చేలా ఉన్నాయి. ఇప్పటికే సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశరాజధాని ఢిల్లీలో రైతులు చేస్తోన్న నిరసనలు మూడు నెలల మైలురాయిని దాటాయి. చట్టాలను వాపస్ తీసుకునేదాకా కదలబోమంటోన్న రైతులు.. చర్చలకు సిద్ధమంటూనే ఆ దిశగా అడుగేయని సర్కారు తీరుతో పరిస్థితి అదే రకంగా కొనసాగుతోంది. దీంతో అధికార పార్టీని టార్గెట్ చేస్తూ రైతు సంఘాలు భారీ ప్రణాళిక సిద్ధం చేశాయి..
Recommended Video
వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేయకుండా మొండిగా వ్యవహరిస్తున్న బీజేపీని ఓడించేందుకు ఆందోళన చేస్తున్న రైతులు పిలుపునిచ్చారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలకు తమ కార్యకర్తలను పంపించి బీజేపీ అభ్యర్థుల్ని ఓడించేందుకు కృషి చేస్తామని భారతీయ కిసాన్ యూనియన్ నేత బల్బీర్ ఎస్ రాజేవాల్, స్వరాజ్ ఇండియా వ్యవస్థాపకులు యోగేంద్ర యాదవ్ అన్నారు. మంగళవారం ఆందోళన జరుగుతున్న ఢిల్లీ సరిహద్దులో మీడియాతో మాట్లాడుతూ నేతలు ఈ మేరకు ప్రకటనలు చేశారు.
''బీజేపీ సహా దాని మిత్రపక్షాలు రైతు వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చాయి ఆ చట్టాలకు వ్యతిరేకంగా బీజేపీని ఓడించాలి. ఇందుకోసం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు మా టీంలను పంపిస్తాం. మార్చి 12న కోల్కతాలో బహిరంగ సభతో మేము ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. ఈ సభలో 10 ముఖ్యమైన కార్మిక సంఘాలు కూడా పాల్గొనబోతున్నాయి. రైతులు, కార్మికులు ఏకమై ఈ యుద్ధాన్ని చేయబోతున్నారు. దేశంలో జరుగుతున్న ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా మార్చి 15న ఆందోళన చేపడతాం'' అని యోగేంద్ర యాదవ్ తెలిపారు. దీనిపై..
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించే విషయమై భారతీయ కిసాన్ యూనియన్ నేత బల్బీర్ ఎస్ రాజేవాల్ మాట్లాడుతూ.. తాము ఏ పార్టీకి మద్దతు ఇవ్వబోమని అయితే ఆయా స్థానాల్లో బీజేపీని ఓడించే సమర్ధులకు మద్దతుగా ఉండి.. బీజేపీని ఓడించేందుకు సహకరిస్తామని, పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాలకు టీంలను పంపేందుకు ఇప్పటికే సిద్ధమయ్యామని చెప్పారు. ''మేం ప్రజలకు మోదీ ప్రభుత్వ దుర్మార్గాల గురించి చెబుతాం. వాళ్లు చేసిన చేస్తోన్న చేయబోతున్న కుట్రల గురించి వివరించి బీజేపీని ఓడించమని చెబుతాం'' అని రాజేవాల్ అన్నారు. కాగా,
మార్చి 15 వరకు దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు చేపట్టాలని సంయుక్త కిసాన్ మోర్చా (రైతు సంఘాల ఐక్య వేదిక) నిర్ణయించిందని, మార్చి 6తో రైతుల ఆందోళన 100వ రోజుకు చేరుకోనున్న సందర్భంగా కుండ్లీ-మానేసర్-పల్వాల్ ఎక్స్ప్రెస్వేను ఉదయం 11 నుంచి సాయంత్రం 4 వరకు దిగ్భందించాలని నిర్ణయించామని రైతు సంఘాల నేతలు తెలిపారు.