డిసెంబర్ 30న రైతులతో కేంద్రం చర్చలు -సర్కారు ప్రతిపాదనకు సంఘాలు ఒకే -ఫలితంపై ఉత్కంఠ
సంస్కరణ పేరిట కేంద్రంలోని మోదీ సర్కార్ తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వాపస్ తీసుకోవాలనే డిమాండ్ తో రైతులు చేస్తోన్న నిరసనలు సోమవారంతో 33వ రోజుకు చేరాయి. వేలాదిగా రోడ్లపైనే నిరసనలు తెలుపుతోన్న రైతన్నలు, ఉత్తరాదిలో భయంకరమైన చలిగాలులు వీస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలు తదితర అంశాల నేపథ్యంలో తదుపరి చర్చల కోసం కేంద్ర ప్రభుత్వం పిలుపునివ్వగా.. అందుకు రైతు సంఘాలు ఎట్టకేలకు అంగీకరించాయి.

డిసెంంబర్ 30న చర్చలు..
వ్యవసాయ చట్టాలపై చర్చలకు రావాల్సిందిగా ప్రభుత్వం నుంచి అందిన ఆహ్వానాన్ని రైతు సంఘాలు అంగీకరించాయి. ఈ నెల 30న చర్చించేందుకు సుముఖత వ్యక్తం చేశాయి. కేంద్రం సూచించిన రోజున చర్చలకు తాము సిద్ధంగా ఉన్నట్టు 40 సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంయుక్త కిసాన్ మోర్చా సభ్యుడు అభిమన్యు కోహర్ పేర్కొన్నారు. ఈ నెల 30న జరగనున్న చర్చల్లో తాము కూడా పాల్గొంటున్నట్టు భారతీయ కిసాన్ యూనియన్ ప్రధాన కార్యదర్శి సత్నామ్ సింగ్ సహాని తెలిపారు. అయితే..

చట్టాలను వెనక్కి తీసుకుంటేనే..
కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని, అది జరగకుంటే ఆందోళన కొనసాగుతుందని రైతు సంఘాలు హెచ్చరించాయి. కేంద్రంతో చర్చలకు సంబంధించి రైతు సంఘాలు నాలుగు కీలక ప్రతిపాదనలు సిద్ధం చేశాయి. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్నది అందులో ప్రధానమనది. రైతు కమిషన్ సిఫార్సుల మేరకు అన్ని వ్యవసాయ ఉత్పత్తులకు చట్టబద్ధంగా లాభదాయకమైన కనీస మద్దతు ధర ప్రకటించాలని, దేశ రాజధాని ప్రాంతంలో గాలి నాణ్యత పెంచడానికి జారీచేసిన ఆర్డినెన్స్లోని నిబంధనల నుంచి రైతులను మినహాయించాలని, రైతు ప్రయోజనాల సంరక్షణ కోసం విద్యుత్తు చట్టసవరణ బిల్లు-2020 ముసాయిదాలో అవసరమైన మార్పులు చేపట్టాలనే ప్రతిపాదనలను కూడా రైతుల రూపొందించారు. కాగా,

మోదీ సర్కార్ డబుల్ గేమ్..
ఈ నెల 30న చర్చలు జరిపేందుకు రావాలని రైతు సంఘాలను కేంద్రం కోరింది. బుధవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి విజ్ఞాన్ భవన్లో చర్చలు జరిపేందుకు రావాలంటూ 40 రైతు సంఘాలకు కేంద్ర వ్యవసాయ శాఖ తాజాగా లేఖ రాసింది. నాలుగు ప్రతిపాదనలను కేంద్రం ముందుంచుతూ.. వాటిని ఎజెండాలో చేరిస్తే చర్చలకు సిద్ధమని రైతు సంఘాలు ప్రకటించాయి. ఈ క్రమంలో మోదీ సర్కారు డబుల్ గేమ్ ఆడుతోందని రైతు సంఘాలు విమర్శించాయి. చర్చల విషయంలో తాము ప్రతిపాదించిన అజెండాను కేంద్రం అంగీకరించడం లేదని, దీనిబట్టి సమస్య పరిష్కారానికి కేంద్రం సుముఖంగా లేదనేది అర్థమవుతోందని అఖిల భారత రైతు పోరాట సమన్వయ సమితి పేర్కొంది. తెలివిగా మాటలతో మాయ చేయాలని చూస్తోందని ఆరోపించింది.












Click it and Unblock the Notifications