ఫాస్టాగ్ యూజర్లకు గుడ్ న్యూస్- ఆ డబ్బులు రీఫండ్ చేసిన NHAI
జాతీయ రహదారుల అథారిటీ (NHAI) కీలక నిర్ణయం తీసుకుంది. టోల్ ప్లాజాల వద్ద చోటు చేసుకుంటోన్న ఎర్రర్ ల వల్ల ఫాస్టాగ్ అమౌంట్ ను కోల్పోతున్న వాహనదారులకు తీపి కబురు వినిపించింది. అటువంటి వారికి రీఫండ్ చెల్లిస్తోంది. ఇప్పటికే 18 లక్షలకు పైగా ఫాస్టాగ్ యూజర్లకు ఎన్హెచ్ఏఐ చెల్లింపులు చేసింది. టోల్ ప్లాజాల వద్ద తమ వాహనాలు వెళ్లనప్పటికీ- కొన్నిసార్లు ఫాస్టాగ్ వ్యాలెట్ల నుండి టోల్ అమౌంట్ డెబిట్ అవుతున్న సంఘటనలు విస్తృతంగా వెలుగులోకి వస్తోన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
చాలాకాలంగా వాహనదారులు ఇటువంటి సమస్యలను ఎదుర్కొంటూ వస్తోన్నారు. తమ వాహనం టోల్ గేట్ దాటనప్పటికీ ఫాస్టాగ్ వాలెట్ నుండి అమౌంట్ డిడక్ట్ అవుతోండటం వాహనదారులకు తీవ్ర ఆందోళన కలిగించింది. ఇది ఎర్రర్ వల్ల సంభవించిందని ఎన్హెచ్ఏఐ గుర్తించింది. ఇటువంటి తప్పు డిడక్షన్ల కారణంగా 2025 జనవరి నుండి డిసెంబర్ మధ్య కాలంలో 17.7 లక్షల కేసులలో టోల్ ఛార్జీలను తిరిగి చెల్లించింది.

ఈ కేసుల్లో దాదాపు 35 శాతం మంది వాహనదారులు, తమ వాహనాలు టోల్ ప్లాజా వద్ద లేనప్పుడే అమౌంట్ డెబిట్ అయినట్లు గుర్తించారు. టోల్ ఆపరేటర్లు వాహన వివరాలను మాన్యువల్గా- అంటే చేతితో నమోదు చేసేటప్పుడు జరిగే పొరపాట్ల వల్ల ఇలాంటి తప్పు లావాదేవీలు జరుగుతున్నాయని ప్రభుత్వం గుర్తించింది. ఈ తరహా సమస్యలను పూర్తిగా నివారించడానికి- ఉపరితల రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఈ మాన్యువల్ ఎంట్రీ ఎంపికను భవిష్యత్తులో పూర్తిగా తొలగించే ఆలోచనలో ఉంది.
ఈ చర్య టోలింగ్ ప్రక్రియలో మరింత పారదర్శకత, ఖచ్చితత్వాన్ని తీసుకువస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ లోక్సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఎలక్ట్రానిక్ టోల్ వసూళ్లకు సెంట్రల్ క్లియరింగ్ హౌస్ (CCH) సేవలను అందించే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) వివరాల ప్రకారం.. గత ఏడాది మొత్తం కోట్లాది ఫాస్టాగ్ లావాదేవీల్లో ఎర్రర్స్ చోటు చేసుకున్నాయి. వీటిల్లో తాజా చెల్లింపులు 0.03 శాతం మాత్రమే. మిగిలిన వాహనదారులకూ చెల్లింపులు జరుపుతామని ఎన్హెచ్ఏఐ పేర్కొంది.
టోల్ వసూలు కోసం వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లను కంప్యూటర్లల్లో మాన్యువల్గా పొందుపర్చే పద్ధతిని నిలిపివేయడంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ఎన్హెచ్ఏఐ వివరించింది. మాన్యువల్ సిస్టమ్ లో టోల్ అటెండెంట్లు తప్పు వివరాలను నమోదు చేసే అవకాశం ఉందని పేర్కొంది. ఫాస్టాగ్ అమలు వల్ల టోల్ ప్లాజాల వద్ద వాహనాలు ఆగే సగటు సమయం 12.2 నిమిషాల నుంచి సగటున 40 సెకన్లకు తగ్గిందని తెలిపింది.












Click it and Unblock the Notifications