ఒడిశాలో ఘోర ప్రమాదం.. ఐదుగురు మృతి..40మందికి గాయాలు..!
ఒడిశా రాష్ట్రంలో సోమవారం రాత్రి ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందగా, 40మందికి తీవ్రగాయాలయ్యాయి. పూరి నుంచికోల్కతాకు బయలుదేరిన ఓ ట్రావెల్స్ బస్సు మార్గమధ్యంలో వంతెనపై నుంచి కింద పడడంతో ఈ ప్రమాదం జరిగింది. జజ్పుర్ జిల్లాలోని 16వ నెంబరు జాతీయ రహదారిపై ఈ ఘోర ప్రమాదం సంబవించింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో యాభై మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.
పూరి నుంచి కోల్కతాకు వెళ్తున్న ప్రయివేట్ బస్సు బారాబతి వంతెన వద్ద రాత్రి తొమ్మిది గంటల సమయంలో అదుపుతప్పి బ్రిడ్జిపై నుంచి పడిపోయింది. ఈ ప్రమాదంలో ఓ మహిళతోపాటు ఐదుగురు అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు. అయితే, వీరిలో ఇరవై మంది ప్రయాణికుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని క్షతగ్రాతులను ఆసుపత్రికి తరలించారు. మొత్తం 16 అంబులెన్సుల్లో గాయపడిన వారిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ బస్సు ప్రమాదంలో మృతిచెందిన వారిని గుర్తించాల్సి ఉందని పోలీసులు చెప్పారు. కానీ, బస్సులో ప్రయాణిస్తున్న వారిలో చాలా మంది పశ్చిమ్ బెంగాల్వాసులని సమాచారం.

స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి...
ఈ ఘోర బస్సు ప్రమాదంపై స్థానిక పోలీస్స్టేషన్ అధికారి మీడియాతో ఈ విధంగా మాట్లాడారు. "బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లే ఈ ఘటన జరిగి ఉండవచ్చని అంటున్నారు. ఈ రోడ్డు ప్రమాదం ఘటనలో ఐదుగురు మృతిచెందారు. వీరిలో ఒక మహిళ కూడా ఉంది. క్షతగ్రాతులను కటక్ ఎస్సీబీ మెడికల్ కాలేజ్కి తరలించామని తెలిపారు. వంతెనపై నుంచి బస్సు పడటంతో బస్సు పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను అతికష్టంతో బయటకు తీయాల్సి వచ్చిందని, ఫైర్ సిబ్బంది గ్యాస్ కట్టర్లను కూడా ఉపయోగించారని అధికారులు వివరించారు. ఇక, ఈ రోడ్డు ప్రమాదంపై రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ స్పందించారు. మృతుల కుటుంబాలకు రూ.3లక్షల ఎక్స్గ్రేషియాను ప్రకటించారు. మృతుల కుటుంబాలకు నా సానుభూతి. గాయపడిన వారు వేగంగా కోలుకోవాలని ఆశిస్తున్నాను అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications