పాస్పోర్ట్లో తండ్రి పేరు అవసరం లేదు: హైకోర్టు సంచలన తీర్పు
న్యూఢిల్లీ: పాస్పోర్ట్ కోసం చేసుకున్న దరఖాస్తులో తండ్రిపేరును ఖచ్చితంగా నమోదు చేయాల్సిన అవసరం లేదని ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. చట్టరీత్యా తండ్రి పేరు ట్రావెల్ డాక్యుమెంట్లో తప్పనిసరేమీ కాదని పేర్కొంది. ఈ ఏడాది మే నెలలో కోర్టు ఇచ్చి ఉత్తర్వును రిఫర్ చేసుకుని తండ్రి పేరును నమోదు చేయాలన్న న్యాయపరమైన నిబంధన ఏదీ లేదని న్యాయమూర్తి సంజీవ్ సచ్దేవ్ పేర్కొన్నారు.
వివరాల్లోకి వెళితే.... తండ్రి పేరును నమోదు చేయకపోవడంతో ఓ ఢిల్లీ యువకుడి పాస్ పోర్ట్ రెన్యువల్ చేయకుండా ఢిల్లీ స్థానిక పాస్పోర్ట్ ఆఫీసు కార్యాలయం తిరస్కరించింది. అంతేకాదు 2017 జూన్ వరకు చెల్లుబాటు అయ్యేలా ఉన్న ఆ యువకుడి పాస్పోర్ట్ను అథారిటీ రద్దు చేసింది.
ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో కోర్సును చేయడానికి 2007లో ఆ యువకుడికి పాస్ పోర్ట్ కార్యాలయం పాస్ పోర్ట్ను జారీచేసింది. కోర్సు పూర్తయ్యే ముందు వరకు అతను పాస్ పోర్ట్ రెన్యువల్ చేసుకోవాల్సి ఉంది. అయితే తన తండ్రి పేరును పాస్పోర్ట్లో ప్రస్తావించని కారణంగా అతనికి పోస్పోర్ట్ జారీ చేసేందుకు ప్రాంతీయ కార్యాలయం నిరాకరించింది.
దాంతో అతను కోర్టును ఆశ్రయించాడు. 2003లో నిర్లక్ష్యంగా వ్యవహరించే తన తండ్రి నుంచి తల్లి విడాకులు పొందిందని, ఈ నేపథ్యంలో రెన్యువల్ ఫామ్లో తండ్రి పేరును నమోదుచేయలేదని ఆ యువకుడు పేర్కొన్నాడు. దరఖాస్తులో తండ్రి పేరును నమోదు చేయకుంటే పాస్పోర్ట్ కార్యాలయం ఆ దరఖాస్తును స్వీకరించదని అధికారులు తెలిపారు.
అయితే తండ్రి పేరు లేనప్పటికీ గతంలో పాస్ పోర్ట్ జారీచేసిన సంగతిని కోర్టు ప్రశ్నించింది. అనంతరం పాస్పోర్ట్పై తండ్రి పేరు అవసరంలేదని తీర్పు వెలువరించారు. గతంలో భర్త నుండి విడాకులు తీసుకున్న ఒక మహిళ తన బిడ్డ ఖర్చు తానే భరిస్తున్నానని, కావున పాస్పోర్ట్లో తండ్రి పేరును తొలగించాలని వేసిన పిటీషన్కు కూడా ఢిల్లీ కోర్టు ఈ విధంగానే స్పందించింది.