Facebook చేయి కాదు, పిడికిలి కూడా -ఆ పోస్టులతో సమాజంలో చీలిక -ఢిల్లీ అల్లర్లపై సుప్రీం సంచలనం
ఇటీవల కాలంలో భారత్ పేరును ప్రపంచ వ్యాప్తంగా పాడుచేసిన, పదుల సంఖ్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోయిన 'ఢిల్లీ అల్లర్ల'కు సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం సంచలన కామెంట్లు, కీలక ఆదేశాలను వెలువరించింది. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో హింస తలెత్తి, మతపరమైన ఘర్షణలుగా మలుపుతిరిగిన ఢిల్లీ అల్లర్ల ఘట్టంలో సోషల్ మీడియా పాత్ర, మరీ ప్రత్యేకించి ఫేస్బుక్ వ్యవహార శైలిపై తీవ్ర విమర్శలొచ్చాయి. మూకను రెచ్చగొట్టేలా బీజేపీ నేతలు చేసిన పోస్టులను తొలగించడంలో ఫేస్బుక్ తాత్సారం చేయడం.. అల్లర్లకు మరింత ఆజ్యం పోసినట్లయిందనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో..

ఫేస్బుక్ చీఫ్కు ఝలక్
ఢిల్లీ అల్లర్ల సమయంలో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ వ్యవహరించిన తీరుపై అనేక విమర్శలు, ఆరోపణలున్నాయి. సంస్థలో అప్పటి పాలసీ హెడ్ అంకీ దాస్.. బీజేపీకి ఫేవర్ గా వ్యవహరించినట్లు రూఢీ కావడంతో తర్వాతి కాలంలో ఆమె పదవి నుంచి తప్పుకున్నారు. కాగా, అల్లర్లకు సంబంధించి ఢిల్లీ అసెంబ్లీ శాంతి, సామరస్య కమిటీ.. ఫేస్బుక్ సంస్థకు నోటీసులు జారీ చేయగా, వాటిని సవాలు చేస్తూ ఫేస్బుక్ ఇండియా ఎండీ అజిత్ మోహన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ అనంతరం తీర్పు వెలువరించిన కోర్టు.. సోషల్ మీడియా దిగ్గజానికి ఝలకిచ్చింది..

కమిటీ ముందు హాజరు కావాల్సిందే
ఢిల్లీ శాసన సభ శాంతి, సామరస్య కమిటీ సమన్లను సవాల్ చేస్తూ ఫేస్బుక్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. సమన్లు ఇచ్చే అధికారం ఈ కమిటీకి ఉందని తెలిపింది. అయితే నేరం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించినప్పటికీ చర్యలకు సిఫారసు చేసే అధికారం లేదని వివరించింది. ఈ నిబంధనలు శాంతిభద్రతలు, పోలీసుల పరిధిలోకి వస్తాయని పేర్కొంది. ఈ అంశాలపై ఢిల్లీ శాసన సభకు అధికారం లేదని తెలిపింది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం గురువారం ఈ తీర్పు చెప్పింది.

చేయి మాత్రమే కాదు, పిడికిలి కూడా
అల్లర్ల వ్యవహారంలో ఢిల్లీ అసెంబ్లీ కమిటీ ఎదుట ఫేస్బుక్ హాజరుకావాల్సిందేననే తీర్పు ఇచ్చిన సందర్భంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ''పరిమితులు లేకుండా ప్రజలను ప్రభావితం చేసే శక్తి, సామర్థ్యాలు ఫేస్బుక్ వంటి సామాజిక మాద్యమ వేదికలకు ఉంది. ఈ వేదికలపై జరిగే చర్చలు, పెట్టే పోస్టుల్లోని కంటెంట్ గురించి వాస్తవాలు సరి చూసుకునే అవకాశాలు చాలా మందికి అందుబాటులో ఉండవు కాబట్టి, ఈ చర్చలు, పోస్టులు సమాజంలో చీలికకు దారి తీస్తాయి. ఫేస్బుక్కు కేవలం చేయి మాత్రమే కాదు, పిడికిలి కూడా ఉంటుంది'' అని కౌల్ ధర్మాసనం పేర్కొంది. కాగా, ఫేస్ బుక్ ఎండీ మోహన్పై ఎటువంటి నిర్బంధ చర్యలు చేపట్టరాదని సుప్రీంకోర్టు ఆదేశించింది. స్వయంగా మోహన్ హాజరుకావాలా? లేదంటే ఫేస్బుక్ తరపున ఎవరైనా హాజరు కావచ్చునా? చెప్పాలని వివరణ కోరింది.












Click it and Unblock the Notifications