ఏపీ చిన్నారుల అద్భుత సాహసం... ఆ బృందంలో ఐఏఎస్ గంధం చంద్రుడి కుమారుడు...
ఆంధ్రప్రదేశ్కు చెందిన ఐదుగురు చిన్నారులు అద్భుత సాహసం చేశారు. లదాఖ్లోని 5,359మీ. ఎత్తయిన ఖర్దుంగ్లా పర్వతాన్ని ఈ చిన్నారులు కేవలం ఐదు రోజుల్లో అధిరోహించి రికార్డు సృష్టించారు. ఈ నెల 15న లదాఖ్కు చేరుకొన్న ఈ చిన్నారులు 16వ తేదీన ఖర్దుంగ్లాను సందర్శించారు. ఈ నెల 16-21 తేదీల్లో ఆ పర్వతాన్ని అధిరోహించారు.
ఖర్దుంగ్లా పర్వతాన్ని అధిరోహించిన చిన్నారుల్లో అనంతపురం జిల్లాకు చెందిన కడపల రిత్వికశ్రీ, కడపల భవ్యశ్రీ, సీల్ల యశశ్విత, కర్నూలు జిల్లాకు చెందిన గంధం సూర్య, గంధం భువన్ ఉన్నారు. వీరిలో రిత్వికశ్రీ వయసు తొమ్మిదేళ్లు కాగా... మిగతా చిన్నారులంతా ఎనిమిదేళ్ల వయసువారే కావడం గమనార్హం. ఈ చిన్నారుల్లో ఒకరైన గంధం భువన్ ఐఏఎస్ గంధం చంద్రుడి కుమారుడు కావడం విశేషం. ఎనిమిదేళ్ల వయసులో తన కుమారుడు ఖర్దుంగ్లా పర్వతాన్ని అధిరోహించడం తనకు చాలా గర్వంగా ఉందని ఉందని గంధం చంద్రుడు ట్వీట్ చేశారు.
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సైతం ఈ చిన్నారుల సాహసాన్ని అభినందించారు. 'లదాఖ్ ప్రాంతంలో 5359మీ. ఎత్తయిన ఖర్ దుంగ్లా పర్వతాన్ని అధిరోహించిన ఆంధ్రప్రదేశ్ చిన్నారులు రిత్వికశ్రీ,భవ్యశ్రీ,యశశ్విత,సూర్య,భువన్లకు అభినందనలు.పదేళ్లు కూడా నిండని ఈ ఐదుగురు చిన్నారుల సాహసం ముచ్చటగొలిపింది. వారి శిక్షకులను,సహకారం అందించినవారిని అభినందిస్తున్నాను.' అని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ఈ చిన్నారుల బృందానికి ఆర్డీటీ క్రీడల ప్రోగ్రామ్ ఇన్ఛార్జి కడపల శంకర్, ఆర్డీటీ ఆస్పత్రి వైద్యుడు హేమచందర్ శిక్షకులుగా వ్యవహరించారు. ఈ చిన్నారుల బృందంలో ఒకరైన రిత్వికశ్రీ ఇప్పటికే కిలిమంజారో పర్వతాన్ని సైతం అధిరోహించడం విశేషం.
ఈ ఏడాది మార్చిలో తెలంగాణకు చెందిన విరాట్ చంద్ర అనే ఏడేళ్ల చిన్నారి కూడా విరాట్ టాంజానియాలో కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించాడు.మార్చి 5న ట్రెక్కింగ్ మొదలు పెట్టి ఆరు రోజుల్లో ఆ పర్వతాన్ని అధిరోహించాడు. ట్రెక్కింగ్ సమయంలో భయాందోళనకు గురైనప్పటికీ... లక్ష్యం పైనే దృష్టి సారించానని... ఎట్టకేలకు పర్వతాన్ని అధిరోహించానని చెప్పుకొచ్చాడు.
At just 8 yrs 1 month, Bhuvan (along other kids of his age) scaled Mt Khardungla(5359 mtrs) in Leh, Ladakh. He got the opportunity to prove his potential &succeeded. OPPORTUNITY is the key.#proudfather #ProudMoment #opportunity @IndiaSports @KirenRijiju @AndhraPradeshCM @ysjagan pic.twitter.com/d55UVTAZb5
— Gandham Chandrudu IAS (@ChandruduIAS) July 27, 2021