ఇండియన్ ముజాహిద్ధిన్: 1,700 పేజీల చార్జ్ షీట్
బెంగళూరు: నిషేధిత ఇండియన్ ముజాహిద్ధిన్ ఉగ్రవాదులకు బాంబులు, పేలుడు పదార్థాలు సరఫరా చేశారని అరెస్టు అయిన నలుగురి మీద బెంగళూరు సీసీబీ పోలీసులు చార్జీషీటు తయారు చేసి 49వ సిటి సివిల్ కోర్టు (ప్రత్యేక కోర్టు)లో సమర్పించారు.
భత్కల్ కు చెందిన ఆయుర్వేదిక్ వైద్యుడు సయ్యద్ ఇస్మాయిల్ అఫక్ (36), ఎంబీఏ విద్యార్థి అబ్బాస్ సబూర్ (24), గుజరి వ్యాపారి సద్దాం హుస్సేన్ (29), దుబాయ్ లో ఉద్యోగం చేసే రియాజ్ సయ్యది (32) అనే నలుగురి మీద చార్జ్ షీట్ సమర్పించామని సీసీబీ విభాగం డీసీపీ రమేష్ తెలిపారు.
పాకిస్థాన్ లో తలదాచుకున్న ఇండియన్ ముజాహిద్దిన్ ఉగ్రవాదులు రియాజ్ భట్కల్, ఇక్బాల్ భత్కల్, ఆసీఫ్ లతో వీరు ప్రత్యక్షంగా సంబంధాలు పెట్టుకున్నారు. ఆయుర్వేదిక్ వైద్యుడు ఇస్మాయిల్ అఫక్ బాంబులు తయారు చెయ్యడంలో శిక్షణ తీసుకున్నాడు.
తరువాత ముగ్గురితో కలిసి 2010 నుండి 2014 సంవత్సరం వరకు భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు బాంబులు సరఫరా చేశారని పోలీసు అధికారులు గుర్తించారు. 2013 ఫిబ్రవరి 21వ తేది హైదరాబాద్ లోని దిల్ షుక్ నగరలో జరిగిన బాంబు పేలుళ్లకు, 2014 మే 1వ తేదిన చెన్నయ్ రైల్వే స్టేషన్ లో జరిగిన బాంబు పేలుళ్లకు వీరే బాంబులు సరఫరా చేశారని పోలీసు అధికారులు అంటున్నారు.
ఈ పూర్తి వివరాలను చార్జ్ షీట్ లో పోందుపరిచామని పోలీసు అధికారులు తెలిపారు. ఆయుర్వేదిక్ వైద్యుడు సయ్యద్ ఇస్మాయిల్ అఫక్ పాకిస్థాన్ లోని కరాచికి చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు. తరువాత పాకిస్థాన్ అల్లుడు అయ్యాడు. సులభంగా వీసా సంపాదించాడు.
అనుమానం రాకుండ 2009లో అత్తగారింటికి వెళుతున్నానని చెప్పి అనేక సార్లు పాకిస్థాన్ వెళ్లి అక్కడ ఉగ్రవాద నాయకులతో భేటి అయ్యాడని పోలీసు అధికారుల విచారణలో వెలుగు చూసింది. వీరి నుండి పలు హార్డ్ డిస్క్ లు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.