ఫంగస్కు రంగులా..? గందరగోళానికి గురిచేయొద్దు.. ఎయిమ్స్ చీఫ్ గులేరియా
కరోనా వైరస్ ఇలా ఉంటే.. ఫంగస్ భయపెడుతోంది. బ్లాక్ ఫంగస్ తర్వాత వైట్ ఫంగస్, యెల్లో ఫంగస్ అని వెలుగులోకి వచ్చింది. దీంతో వీటి లక్షణాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. దీనిపై ఎయిమ్స్ చీఫ్ రణదీప్ గులేరియా స్పందించారు. ఫంగస్కు రంగులు ఆఫాదించి గందరగోళానికి గురి చేయొద్దని స్పష్టంచేశారు. జనాలను ఇబ్బందికి గురిచేయొద్దని తేల్చిచెప్పారు.
దేశంలో గత కొన్నిరోజులుగా బ్లాక్ ఫంగస్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. తర్వాత వైట్ ఫంగస్, ఇప్పుడు ఎల్లో ఫంగస్ పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. కరోనా రోగుల్లో ప్రాణాంతకంగా మారుతున్న ఫంగస్లకు రంగులు ఆపాదించడంపై ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా స్పందించారు. ఫంగస్లను రంగుల పేర్లతో పిలవడం ద్వారా గందరగోళం సృష్టిస్తున్నారని, ఒకరకంగా ఇది తప్పుదారి పట్టించడమేనని అభిప్రాయపడ్డారు.
ఫంగస్ ఒక్కోప్రాంతంలో ఒక్కో రంగులో కనిపిస్తుందని ఆయన వివరించారు. అక్కడి పరిస్థితులు దాని రంగును ప్రభావితం చేస్తాయని స్పష్టం చేశారు. ఫంగల్ ఇన్ఫెక్షన్ సంక్రమిక వ్యాధి కాదని అన్నారు. ఫంగల్ ఇన్ఫెక్షన్లు మూడు రకాలు అని... అవి 1.మ్యూకార్ మైకాసిస్ 2.కాండిడా 3.ఆస్పర్ జిల్లోసిస్ అని వివరించారు. వీటిలో మ్యూకార్ మైకాసిస్ కరోనా నుంచి కోలుకున్న రోగుల్లో ఎక్కువగా కనిపిస్తున్నట్టు చెబుతున్నారని వివరించారు. ఆస్పర్ జిల్లోసిస్ ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ కలిగిస్తుందని తెలిపారు.
కరోనా మూడో వేవ్ తథ్యమని, మూడో వేవ్ లో పిల్లల పాలిట కరోనా ప్రమాదకరంగా మారుతుందనే ప్రచారంపై గులేరియా స్పందించారు. ఈ ప్రచారంలో నిజంలేదని స్పష్టం చేశారు. పీడియాట్రిక్స్ అసోసియేషన్ నివేదిక ప్రకారం పిల్లలపై కరోనా థర్డ్ వేవ్ ఏమాత్రం ప్రభావం చూపబోదని.. దీనిపై ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు.