ఈ ఏడాదితోనే వీడ్కోలు: పెద్ద నోట్లకు ఇక చెల్లు చీటే..
పాతనోట్ల స్థానంలో కొత్తనోట్లను మార్చుకోవడానికి గడువును ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచబోమని కేంద్రం స్పష్టం చేసింది. డిసెంబర్ 30 గడువును పొడగించే ఆలోచన లేదని స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ: పాతనోట్ల స్థానంలో కొత్తనోట్లను మార్చుకోవడానికి గడువును ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచబోమని కేంద్రం స్పష్టం చేసింది. డిసెంబర్ 30 గడువును పొడగించే ఆలోచన లేదని స్పష్టం చేసింది. ఆర్బీఐ, మిగతా బ్యాంకుల వద్ద సరపడా నిల్వలున్నాయని తెలిపింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో మంగళవారంనాడు ఓ ప్రకటన చేసింది.
పాత ఐదు వందలు, వేయి రూపాయల నోట్లను డిపాజిట్ చేసే గడువును డిసెంబర్ 30వ తేదీ నుంచి పొడిగించే ప్రసక్తి లేదని చెప్పింది. దీంతో పాతనోట్లకు నూతన సంవత్సరానికి ముందే వీడ్కోలు పలుకుతోంది.
రిజర్వ్ బ్యాంకు వద్ద తగినన్ని కొత్త నోట్లు ఉన్నాయని కూడా ప్రభుత్వం చెప్పింది. వంద రూపాయల నోట్ల చెలామణిని ఇప్పటికే పెంచినట్లు తెలిపింది. ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ఓ ప్రశ్నకు ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో ఈ విషయాన్ని వివరించారు.
గ్రామీణ ప్రాంతాల అవసరాలు తీర్చడానికి చిన్న నోట్లను అందించాలని బ్యాంకులకు సూచించినట్లు ఆయన తెలిపారు. తాజా ప్రభుత్వ నిర్ణయంతో డిసెంబర్ 30వ తేదీ తర్వాత పాత ఐదు వందలు, వేయి రూపాయల నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవడానికి కుదరదు. అవి పూర్తిగా చిత్తు కాగితాల కిందికి మారిపోతాయి.