శశికళ బేఖాతర్: తానొకటి తలిస్తే గవర్నర్ మరోటి, వారిపై ఫైర్
తనకు తిరుగులేదనే నమ్మకంతో తన ప్రమాణ స్వీకారానికి శశికళ ఏర్పాట్లు చేసుకున్నారు. దానికి ప్రభుత్వ అధికారులు గవర్నర్ చేత చీవాట్లు తిన్నారు.
చెన్నై: ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించడానికి శశికళ నటరాజన్ చకచకా ఏర్పాట్లు చేసుకున్నారు. తానొకటి తలిస్తే గవర్నర్ మరోటి తలిచినట్లు ఉన్నారు. దాంతో శశికళకు కథ అడ్డం తిరిగింది. గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు శుక్రవారం చెన్నైలోనే మకాం వేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోనూ డిజిపితోనూ చెన్నై పోలీసు కమిషనర్తోనూ సమావేశమయ్యారు.
ఒక రకంగా గవర్నర్ను బేఖాతరు చేస్తూ తమిళనాడు అధికార యంత్రాంగాన్ని శశికళ నడిపించారనే అర్థమవుతూనే ఉంది. పేరు పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి అయినా అంతా నడిపించింది శశికళనే అనే విషయం అందరికీ తెలిసిందే. తాను అనుకున్నదే జరుగుతోందనే ఉద్దేశంతో తన ప్రమాణ స్వీకారానికి కూడా ఏర్పాట్లు చేసుకున్నారు. అందుకు ప్రతిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపి గవర్నర్ చేతిలో మొట్టికాయలు తిన్నారు.
రాజ్భవన్ నుంచి ఎటువంటి ఆదేశాలు లేకుండా శశికళ ప్రమాణాస్వీకారానికి ఏర్పాట్లు చేయడంపై విద్యాసాగర రావు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. తన అనుమతి లేకుండా ఎందుకు చేయవలసి వచ్చిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను ఆయన నిలదీశారని అంటున్నారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో గవర్నర్తో సీఎస్ గిరిజా వైద్యనాథన్, డీజీపీ రాజేంద్రన్, చెన్నై పోలీస్ కమిషనర్ జార్జ్ భేటీ అయ్యారు.

శుక్రవారం మధ్యాహ్నం 12.15 గంటలకు రాజ్భవన్కు వచ్చిన వీరు 50 నిముషాలకు పైగా గవర్నర్తో మాట్లాడారు.
ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న సంక్షోభం గురించి, తదుపరి తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. తన అనుమతి లేకుండా, రాజ్భవన్ నుంచి ఎలాంటి ఆదేశాలు వెలువడకుండా శశికళ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఎందుకు ఏర్పాట్లు చేయాల్సి వచ్చిందని, ఎవరి ఆదేశాలతో ఇదంతా చేశారని వారిని గవర్నర్ వారిని అడిగినట్లు తెలుస్తోంది.
సీఎంగా శశికళ ప్రమాణ స్వీకారం చేసేందుకు అనువుగా మెరీనాతీరంలో వున్న మద్రాస్ యూనివర్సిటీలోని సెంటినరీ హాలును సిద్ధం చేసిన విషయం తెలిసిందే. లక్షలాది రూపాయలు ఖర్చు చేసి దాన్ని అందంగా తీర్చిదిద్దారు. ఆఘమేఘాల మీద ఆ పనులు పూర్తి చేశారు.
శశికళ ప్రమాణస్వీకారోత్సవానికి భారీగా జనం వచ్చే అవకాశం ఉందనే ఉద్దేశంతో మెరీనాతీరంలో అంతకు ముందు నుంచి ఉన్న 144 సెక్షన్ను కూడా తొలగించారు. ప్రభుత్వం సంక్షోభంలో ఉన్నందున తన సూచనలు లేకుండా ఎలాంటి కార్యక్రమాలు తీసుకోవద్దని గవర్నర్ వారిని హెచ్చరించినట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications