టిపై అద్వానీ, సుష్మ ఆగ్రహం: కోదండ, కెసిఆర్ స్పందన
న్యూఢిల్లీ: పార్లమెంటులో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ తప్ప మరో విషయం చర్చకు వచ్చే అవకాశం కనిపించడం లేదని భారతీయ జనతా పార్టీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ అన్నారు. ఇలాంటి ఉద్రిక్తతల మధ్య మొదట ఓటాన్ అకౌంట్ బిల్లు మాత్రమే పెట్టాలన్నారు. పార్లమెంటులో ఇలాంటి సంఘటనలు ఎప్పుడు చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
సభలో కాంగ్రెసు పార్టీకి చెందిన సభ్యులే హింసకు పాల్పడ్డారని ఆరోపించారు. కేంద్రమంత్రులను అడ్డుకోవడంలో కాంగ్రెసు పార్టీ విఫలమైందన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి పరిణామాలు ఏమాత్రం మంచివి కావన్నారు. తెలంగాణ ముసాయిదా బిల్లు వివాదాస్పద బిల్లు అన్నారు. బిల్లుపై తమ వైఖరిని పార్టీ నిర్ణయిస్తుందని చెప్పారు. ఘటనకు కేంద్రమే బాధ్యత వహించాలన్నారు.
లోకసభలో జరిగిన ఘటనకు కేంద్రమే బాధ్యత వహించాలని సుష్మా స్వరాజ్ అన్నారు. ఇది కాంగ్రెసు పార్టీ కుట్ర అని నిప్పులు చెరిగారు. కాంగ్రెసు పార్టీ పార్లమెంటరీ నిబంధలను తుంగలో తొక్కుతోందన్నారు. తెలంగాణ బిల్లును ప్రవేశ పెట్టే సమయంలో నిబంధనలు తుంగలో తొక్కారని ఆరోపించారు. బిల్లుపైన తమకు ఎలాంటి సమాచారం లేదని చెప్పారు. ప్రభుత్వంతో ఏ రూపంలో తాము చర్చలు జరపమన్నారు.
వీళ్లతో ఇంతకాలమున్నామా: కోదండరామ్
బిల్లు పెట్టే సమయంలో సీమాంధ్ర ఎంపీలు హింసాత్మక పనులు చేయడం సరికాదని, ఇంతకాలం ఇలాంటి వాళ్లతో తాము కలిసి ఉన్నామా అని బాధపడుతున్నామని తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ గురువారం అన్నారు. సభ జరగకుండా వుంటే బాగుండునన్న ఉద్దేశంతోనే లగడపాటి పెప్పర్ స్ప్రే వాడారన్నారు. ఈ సమయంలో తెలంగాణా ప్రజలు సంయమనంతో ఉండాలన్నారు.
సంయమనం పాటించండి: కెసిఆర్
తెలంగాణ ప్రజలు సంయమనం పాటించాలని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతోందని, రాష్ట్ర ఏర్పాట విషయంలో ఆందోళన అవసరం లేదన్నారు. సీమాంధ్ర ఎంపీలు దుర్మార్గంగా వ్యవహరించారని మండిపడ్డారు.