21వ శతాబ్దపు అతిపెద్ద పిచ్చి చర్య జీఎస్టీ:మోడీకి షాకిచ్చిన సుబ్రమణ్యస్వామి,పీవీకి ‘భారతరత్న’ డిమాండ్
హైదరాబాద్: చైనా ఆర్థిక వ్యవస్థను భారత్ త్వరలోనే అధిగమిస్తుందని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి అన్నారు. ప్రజ్ఞాభారతి ఆధ్వర్యంలో నగరంలోని ఓ హోటల్లో నిర్వహించిన కార్యక్రమంలో '2030 నాటికి బలమైన ఆర్థిక శక్తిగా భారత్' అనే అంశంపై మాట్లాడుతూ.. 2020-21 నాటికి భారత్ 5 ట్రిలియన్ డాలర్ల వృద్ధి సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

పీవీ నర్సింహారావుకు భారతరత్న ఇవ్వాలంటూ..
స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి 1990 వరకు భారత్ అంతగా అభివృద్ధి చెందలేదని, ప్రస్తుతం ఏడాదికి 3.5 శాతం మాత్రమే జీడీపీ వృద్ధి సాధిస్తోందని సుబ్రమణ్యస్వామి అన్నారు. దీనికి కారణం మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూనే అని ఆయన ఆరోపించారు. నెహ్రూ అవలంభించిన సోవియెట్ ఆర్థిక విధానాల వల్లే ఇలాంటి పరిస్థితులు ఏర్పాడ్డయని అన్నారు. నాటి ప్రధాని పీవీ నర్సింహారావు తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలతో ఆ సమయంలో ఏడాదికి 8 శాతం జీడీపీ వృద్ధి సాధించిందని సుబ్రమణ్యస్వామి వివరించారు. దేశంలో సంస్కరణలను ప్రవేశపెట్టిన పీవీ నర్సింహారావుకు భారతరత్న ఇవ్వాలని సుబ్రమణ్యస్వామి డిమాండ్ చేశారు.

భారత్.. చైనాను అధిగమిస్తుంది..
అనంతరం వచ్చిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా దాన్ని కొనసాగించారని చెప్పారు. అప్పటి నుంచి దేశ జీడీపీ వృద్ధిరేటు పెరుగుతూ వచ్చిందన్నారు. నేటి ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఆర్థిక సంస్కరణలు తీసుకొస్తున్నారని ప్రశంసించారు. ఇవి భవిష్యత్తులో మంచి ఫలితాలనిస్తాయని అన్నారు. నిరుద్యోగ, పేదరిక నిర్మూలన వంటి వాటిపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించిందని తెలిపారు. ఏడాదికి 10 శాతం వృద్ధి సాధిస్తే.. వచ్చే పదేళ్లలో భారత్ చైనాను అధిగమిస్తుందని సుబ్రమణ్య స్వామి వివరించారు.

మోడీకి షాకిస్తూ.. జీఎస్టీపై సంచలన వ్యాఖ్యలు
అయితే, వస్తు సేవల పన్ను(జీఎస్టీ)పై మాత్రం సుబ్రమణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. 21వ శతాబ్దంలో తీసుకున్న అతిపెద్ద పిచ్చి చర్యగా ఆయన అభివర్ణించారు. ఈ ఆదాయపుపన్ను, జీఎస్టీతో పెట్టుబడిదారులు బెంబేలెత్తిపోతున్నారని, ఇది తగదని అన్నారు. ఆర్థిక సంస్కరణలో భాగంగా కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం జీఎస్టీని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ.. భవిష్యత్తులో జీఎస్టీతో మంచి ఫలితాలుంటాయని, దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్షయం తీసుకున్నట్లు కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications