ఆ 39 మందిని టెర్రరిస్టులు చంపడం చూశా: హర్జీత్,ట్విస్టిచ్చిన సుష్మాస్వరాజ్
Recommended Video
న్యూఢిల్లీ: ఐసిస్ ఉగ్రవాదులకు బందీలుగా చిక్కిన 39 మంది భారతీయులను చంపడాన్ని తాను కళ్ళారా చూశానని హర్జీత్ మసిహ్ అనే వ్యక్తి చెప్పడంపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ స్పందించారు హర్జీత్ చెబుతున్న విషయాల్లో వాస్తవం లేదని ఆమె అభిప్రాయపడ్డారు.
39 మంది భారతీయులను కాల్చి చంపిన ఐసిస్
ఇరాక్లో నాలుగేళ్ళ క్రితం కిడ్నాపైన 39 మందిని ఐసిస్ తీవ్రవాదులు హత్య చేశారని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ మంగళవారం నాడు రాజ్యసభలో ప్రకటించారు. అయితే వీరంతా సజీవంగా ఉన్నారని భావిస్తున్న ఆ కుటుంబాల్లో విషాదం నిండింది.
అయితే లోక్సభలో ఈ విషయమై సుష్మా స్వరాజ్ ప్రకటన చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు.సభలో గందరగోళ వాతావరణం నెలకొనడంతో ప్రకటన చేయలేదు. ఇదిలా ఉంటే 39 మంది భారతీయులను ఐసిస్ తీవ్రవాదులు చంపడం తాను చూశానని హర్జీత్ చెప్పడంపై సుష్మా మంగళవారం మీడియాతో మాట్లాడారు.
హర్జీత్ చెప్పేది అవాస్తవం
నాలుగేళ్ళ క్రితం ఇరాక్లో కిడ్నాపైన 39 మంది భారతీయులను ఐసిస్ తీవ్రవాదులను చంపేశారని రాజ్యసభలో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ మంగళవారం నాడు ప్రకటించారు.అయితే భారతీయులను ఐసిస్ తీవ్రవాదులు చంపడాన్ని తాను కళ్ళారా చూశానని పంజాబ్ రాష్ట్రానికి చెందిన హర్జీత్ మసిహ్ చెబుతున్న మాటల్లో వాస్తవం లేదని ఆమె ప్రకటించారు. ఈ విషయమై మంగళవారం నాడు సుష్మా స్వరాజ్ మీడియాతో మాట్లాడారు.
టెర్రరిస్టులకు హర్జీత్ చిక్కలేదు
మోసుల్లో ఐసిస్ ఉగ్రవాదులకు చిక్కిన బందీల్లో హర్జీత్ లేనే లేడని సుష్వా స్వరాజ్ ప్రకటించారు. అయితే ఉగ్రవాదుల నుంచి రక్షించుకునేందుకు అలీగా తన పేరును మార్చుకున్నాడని ఆమె చెప్పారు. కొంతమంది బంగ్లాదేశీయులతో కలిసి తప్పించుకునే యత్నం చేశాడని ఆమె వివరించారు. . ఆ ప్రయత్నంలో ఎర్బిల్ వద్ద ఇరాక్ ఆర్మీకి అతను పట్టుబడ్డాడని ఆమె చెప్పారు.
హర్జీత్ను వేధించలేదు
హర్జీత్ను భారత రాయబార కార్యాలయానికి తరలించి అక్కడ వేధింపులకు పాల్పడినట్టు వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్వాస్వరాజ్ ప్రకటించారు. ఒక పౌరుడిగా అతను చెబుతున్న మాటలను.. భాద్యతగల ప్రభుత్వంగా విచారణ చేపట్టాకే మేం ధృవీకరించాల్సి ఉంటుందని ఆమె చెప్పారు. అతన్ని అధికారులు వేధించారన్న ఆరోపణలు కూడా నిజం లేదని అంటూ సుష్మా వివరించారు.
హర్జీత్ ఏం చెప్పాడంటే
పంజాబ్కు చెందిన హర్జిత్ వలస కూలీగా మోసుల్కు వెళ్లాడు. నిర్మాణ పనుల కోసం వెళ్లిన అతన్ని, మరో 39 మంది భారతీయ కూలీలను జూన్ 11, 2014లో ఐసిస్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారని ఆయన మీడియాకు చెప్పారు. తన కళ్ల ముందే వారందరినీ ఉగ్రవాదులు ఊచకోత కోశారు. అయితే గాయాలతో ఉన్న తాను చచ్చినట్లు నటించి ప్రాణాలతో బయటపడ్డానని ఆయన మీడియాకు చెబుతున్నారు. ఎర్బిల్ ప్రాంతంలో ఇరాకీ ఆర్మీ చెక్ పాయింట్ వద్ద తనను గమనించిన అధికారులు భారతీయ రాయబార కార్యాలయానికి తీసుకెళ్లారని చెప్పారు.
లోక్సభలో ప్రకటన చెయ్యనివ్వరా?
రాజ్యసభలో ప్రకటన చేస్తే విన్నారుని కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ చెప్పారు. లోక్సభలో మాత్రం ఈ ప్రకటన చేయకుండా కాంగ్రెస్ పార్టీ నేతలు ఎందుకు అడ్డుకుంటున్నారని ఆమె ప్రశ్నించారు. ఈ ఆందోళనలకు కాంగ్రెస్ నేతృత్వం వహిస్తోంది అంటూ ఆమె ఆక్షేపించారు. ఇక మృతదేహాల గుర్తింపు కష్టతరంగా ఉన్నప్పటికీ.. త్వరలో వాటిని ఇండియాకు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు.