చేయకూడని తప్పు చేశా.. : సూసైడ్ నోట్లో అట్లాస్ యజమాని భార్య
ప్రముఖ సైకిల్ తయారీ సంస్థ అట్లాస్ యజమాని సంజయ్ కపూర్ భార్య నటాషా కపూర్ మంగళవారం ఢిల్లీలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. నటాషా ఆత్మహత్య చేసుకున్న గదిలో పోలీసులకు సూసైడ్ లభ్యమవగా.. తాజాగా ఆ వివరాలను బయటపెట్టారు. చేయకూడని తప్పు చేసినందువల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు నటాషా అందులో పేర్కొన్నారు. అయితే ఆ తప్పు ఏంటన్నది మాత్రం ఆమె వెల్లడించలేదు.
'నన్ను నేనే చంపుకుంటున్నాను. నా చావుకు ఎవరూ కారణం కాదు. నేను చేయకూడని తప్పు చేశాను. నా కళ్లలో అపరాధ భావం నిండిపోయింది. చేసిన దానికి చాలా సిగ్గుపడుతున్నాను. సంజయ్,నా కుమార్తె,నా కమారుడు..అందరికీ ఐలవ్యూ.. జాగ్రత్తగా ఉండండి.' అంటూ నటాషా సూసైడ్ లేఖలో పేర్కొన్నారు.
మంగళవారం మధ్యాహ్నం 3.30గం. సమయంలో నటాషా ఆత్మహత్య గురించి సమాచారం అందుకున్నట్టు పోలీసులు తెలిపారు. మధ్యాహ్నం నటాషా కుమారుడు సిద్దాంత.. లంచ్కు రావాలని చెప్పేందుకు ఆమెకు చాలాసార్లు కాల్ చేశాడని, కానీ ఆమె వైపు నుంచి ఎటువంటి స్పందనా రాలేదని చెప్పారు. దాంతో ఆమె గదిలోకి వెళ్లి చూడగా.. సీలింగ్కు ఉరి వేసుకుని కనిపించిందన్నారు. మొదట అతను డోర్పై తట్టాడని, ఎంతకీ తీయకపోవడంతో.. నెట్టి చూశాడని, తలుపు గడి పెట్టకపోవడంతో తెరుచుకుందని తెలిపారు.
పనిమనుషుల సాయంతో ఆమె మృతదేహాన్ని సీలింగ్ నుంచి కిందకు దించి.. బెడ్పై పడుకోబెట్టినట్టు తెలిపారు. అనంతరం సీపీఆర్(కార్డియో పల్మనరీ రెసస్కిటేషన్) విధానంలో ఆమె గుండెపై బలంగా కొడుతూ నోటిలో గాలిని ఊదారని, అయినప్పటికీ లాభం లేకపోయిందని చెప్పారు. సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే ఆమె మృతి చెందినట్టు స్పష్టం చేశారు.