కుమారస్వామి సంచలన నిర్ణయం: సీఎం అయినా ప్రభుత్వ బంగ్లాలకు దూరం, జేపీ నగర్ ఇల్లు!
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చెయ్యడానికి సిద్దం అయిన హెచ్.డి. కుమారస్వామి సంచలన నిర్ణయం తీసుకున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా హెచ్.డి. కుమారస్వామి ప్రభుత్వం కేటాయించే బంగ్లాలకు దూరంగా ఉండాలని నిర్ణయించారు. బెంగళూరులోని జేపీ నగరలోని సొంత ఇంటి నుంచి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించాలని హెచ్.డి.కుమారస్వామి నిర్ణయం తీసుకున్నారు.
సీఎంకు బంగ్లాలు
కర్ణాటక ముఖ్యమంత్రులు నివాసం ఉండటానికి బెంగళూరు నగరంలోని అనుగ్రహ, కావేరీ బంగ్లాలు కేటాయించడం ఆనవాయితి. కర్ణాటక ముఖ్యమంత్రులు అనుగ్రహ, కావేరీ బంగ్లాల నుంచి బాధ్యతలు నిర్వహించారు. నిత్యం ముఖ్యమంత్రులను కలవడానికి వచ్చేవారితో అనుగ్రహ, కావేరీ బంగ్లాలు కిటకిటలాడుతాయి.
జేపీ నగర్ నివాసం
బెంగళూరు నగరంలోని మినీఫారెస్టు రోడ్డులో కుమారస్వామి నివాసం ఉంటున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత జేపీ నగర్ లోని సొంత ఇంటి నుంచి అధికారికంగా నిర్ణయాలు తీసుకోవాలని హెచ్.డి. కుమారస్వామి నిర్ణయం తీసుకున్నారు.
సినిమాలు, సీఎం పదవి
గతంలో జేపీ నగర్ లోని మినీ ఫారెస్టు రోడ్డులోని ఇంటిలో హెచ్.డి. కుమారస్వామి నివాసం ఉండేవారు. ఆ ఇంటిలో నివాసం ఉంటున్న సమయంలో సినీరంగంలో పంపిణిదారుడిగా, సినీ నిర్మాతగా, వ్యాపారవేత్తగా హెచ్.డి. కుమారస్వామి ఓ వెలుగు వెలిగారు. తరువాత రాజకీయాల్లోకి వచ్చిన హెచ్.డి. కుమారస్వామి బీజేపీ, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో కర్ణాటక ముఖ్యమంత్రిగా 20 నెలలు పని చేశారు.
సెంటిమెంట్ ఇల్లు
గతంలో సీఎం పదవికి రాజీనామా చేసిన హెచ్.డి. కుమారస్వామి జేపీ నగర్ లోని ఇంటి నుంచి వేరే ఇంటికి మకాం మార్చారు. అయితే జోతిష్యుల సలహామేరకు 2018 ఎన్నికల ప్రచారం ప్రారంభించక ముందు జేపీ నగర్ లోని ఇంటికి మరమత్తులు చేయించారు. అనంతరం జేపీ నగర్ లోని ఇంటికి గృహప్రవేశం చేసిన హెచ్.డి. కుమారస్వామి అక్కడికి కాపురం మార్చారు.
అధికారులకు సమాచారం
ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత అనుగ్రహ, కావేరీ బంగ్లాలకు కాపురం మార్చనని, జేపీ నగర్ లోని సొంత ఇంటిలో నివాసం ఉంటానని హెచ్.డి. కుమారస్వామి కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, బెంగళూరు నగర పోలీసు కమిషనర్ కు ఇప్పటికే సమాచారం ఇచ్చారు.
అదృష్ణానికి నిలయం
జేపీ నగరలోని ఇల్లు అన్ని విషయాల్లో కలిసి వచ్చిందని, అదృష్ణానికి నిలయం అని హెచ్.డి. కుమారస్వామి అదే బంగ్లాలో నివాసం ఉండాలని నిర్ణయించారని ఆయన సన్నిహితులు అంటున్నారు. జేపీ నగర్ లోని ఇంటిని పోలీసు అధికారులు పరిశీలించి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే సీఎం అధికారిక నివాసం కృష్ణా బంగ్లాను మాత్రం ప్రజలను కలుసుకోవడానికి ఉపయోగించుకోవాలని హెచ్.డి. కుమారస్వామి నిర్ణయించారు.