సెల్ఫోన్లు ఆర్డర్ చేసి, 166సార్లు మోసం: అమెజాన్కు రూ.50 లక్షల కుచ్చుటోపీ
ఢిల్లీలో 21 ఏళ్ల ఓ యువకుడు అమెజాన్లో ఫోన్లు కొని, 166 సార్లు మోసం చేశాడు. ఖరీదైన ఫోన్లు ఆర్డర్ చేయడం, డబ్బులు కట్టి వాటిని తీసుకోవడం, ఆ తర్వాత ఖాళీ బాక్స్ వచ్చిందని చెప్పి రిటర్న్ చేయడం. ఇదీ ఆయన తీరు
న్యూఢిల్లీ: ఢిల్లీలో 21 ఏళ్ల ఓ యువకుడు అమెజాన్లో ఫోన్లు కొని, 166 సార్లు మోసం చేశాడు. ఖరీదైన ఫోన్లు ఆర్డర్ చేయడం, డబ్బులు కట్టి వాటిని తీసుకోవడం, ఆ తర్వాత ఖాళీ బాక్స్ వచ్చిందని చెప్పి రిటర్న్ చేయడం. ఇదీ ఆయన తీరు.
తద్వారా అతను రెండు నెలల వ్యవధిలోనే అమెజాన్కు రూ.50 లక్షల నష్టం కలిగించాడు. ఏకంగా 166 సార్లు డబ్బును రీఫండ్ చేయించుకోవడం గమనార్హం.
పరిజ్ఞానం లేకపోవడంతో ఉద్యోగం రాలేదు
శివమ్ చోప్రా(21) హోటల్ మేనేజ్మెంట్ కోర్సు పూర్తి చేశాడు. అతడు చేసిన కోర్సులో సరైన పరిజ్ఞానం లేకపోవడంతో ఉద్యోగం సంపాదించలేకపోయాడు. దీంతో అక్రమంగా డబ్బు సంపాదించే మార్గాన్ని ఎంచుకున్నాడు.
Recommended Video
అమెజాన్ నుంచి మొదట ఇలా
ఆన్లైన్ రిటైల్ సంస్థ అమెజాన్ నుంచి రెండు ఫోన్లు ఆర్డర్ చేశాడు. ఆ ఫోన్లను తీసుకుని తనకు ఖాళీ డబ్బాలు మాత్రమే వచ్చాయని తిరిగి అమెజాన్ సంస్థకు ఫిర్యాదు చేసేవాడు. దీంతో రిఫండ్ కోరగా, డబ్బులు అతని ఖాతాలోకి వచ్చేవి.
హైఎండ్ ఫోన్లను బుక్ చేసి
ఆ తర్వాత ఆపిల్, శాంసంగ్, వన్ ప్లస్ వంటి ప్రముఖ కంపెనీల హైఎండ్ ఫోన్లకు వేర్వేరు ఫోన్ నెంబర్లు, చిరునామాలతో ఆర్డర్స్ ఇచ్చేవాడు. అయితే శివంకు సిమ్ కార్డులు సరఫరా చేసేందుకు సచిన్ జైన్ అనే చిన్న టెలికం స్టోర్ ఓనర్ సహకరించాడు. 141 ప్రీ యాక్టివేటెడ్ సిమ్ కార్డులను శివంకు ఇచ్చాడు. ఈ నెంబర్లను ఉపయోగిస్తూ శివం ఫోన్లను కొనేవాడు.
రెండు నెలల్లో 166 ఫోన్సు
ఇలా తప్పుడు చిరునామాలతో రెండు నెలల్లో 166 ఫోన్లకు ఆర్డరిచ్చాడు. ఫోన్ను డెలివరీ చేసేందుకు వచ్చే బాయ్, ఆ అడ్రస్లో లేరని తెలుసుకుని కాల్ చేయగా, దగ్గర్లోనే మరోచోట ఉన్నానని చెప్పేవాడు. రెండుమూడు సందులు తిప్పి ఫలానా చోటకు రావాలని డెలివరీ బాయ్కు శివ సూచించేవాడు. మొత్తానికి ఫోన్ డెలివరీ అయిన కొద్ది సేపటికి.. తనకు ఫోన్ రాలేదని, ఖాళీ బాక్స్ వచ్చిందని నాటకాలు ఆడేవాడు.
రూ.50 లక్షల మేర మోసం
తనకు ఖాళీ డబ్బులు వచ్చాయని ఫిర్యాదు చేసి, అమెజాన్ నుంచి తన డబ్బులు రిఫండ్ చేయాలని కోరేవాడు. దీంతో అతని డబ్బులు అతనికి వచ్చేవి. ఇలా రెండు నెలల వ్యవధిలో 166 ఫోన్లకు ఆర్డరిచ్చి రూ.50 లక్షలు మోసం చేశాడు. మొత్తానికి అమెజాన్ ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. శివం నుంచి 19 మొబైల్ ఫోన్లు, రూ. 12 లక్షల నగదు, 40 పాస్బుక్లు, చెక్కులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.