దయనీయం: రెండు నెలలుగా ఆకలితో అల్లాడుతున్న కుటుంబం-లాక్డౌన్తో బుక్కెడు బువ్వకు దూరం...
కరోనా లాక్డౌన్ ప్రభావం ఓ కుటుంబాన్ని అత్యంత దయనీయ స్థితిలోకి నెట్టింది. 45 ఏళ్ల ఓ మహిళ,ఆమె ఐదుగురు పిల్లలు రెండు నెలలుగా ఆకలితో అలమటిస్తున్నారు. గతేడాది ఆ ఇంటి పెద్ద కరోనా సోకి మృతి చెందగా... ఐదుగురు పిల్లల్లో పెద్దవాడైన 20 ఏళ్ల యువకుడిపై కుటుంబ భారం పడింది. రెక్కలు ముక్కలు చేసుకుని రోజూ కూలీ పనులకు వెళ్తూ ఎలాగోలా కుటుంబాన్ని నెట్టుకొస్తున్న తరుణంలో... ఈ ఏడాది లాక్డౌన్ రూపంలో ఆ కుటుంబంపై మరో పిడుగు పడింది. కుటుంబంలో సంపాదించే ఆ ఒక్కడి పని కూడా పోయింది. దీంతో గత రెండు నెలలుగా ఆ కుటుంబంలో ఆకలికి అల్లాడుతోంది.
ఆస్పత్రిలో ఆ ఐదుగురు...
ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్కి చెందిన ఆ కుటుంబ దయనీయ స్థితిని ఓ ఎన్జీవో సంస్థ వెలుగులోకి తీసుకొచ్చింది. 45 ఏళ్ల గుడ్డి అనే ఆ ఇంటి మహిళ,ఆమె ఐదుగురు పిల్లలు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రెండు నెలలుగా తిండికి దూరమవడంతో బక్క చిక్కి అనారోగ్యం బారినపడ్డారు. వారికి సరైన పౌష్టికాహారం అందిస్తున్నామని... త్వరలోనే కోలుకుంటారని వైద్యులు చెప్పారు. ఆందోళన చెందాల్సిందేమీ లేదన్నారు.
లాక్డౌన్తో తిండికి దూరమై...
గుడ్డి భర్త కూలీ పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషించేవాడు. గతేడాది కరోనాతో అతను మృతి చెందాడు. అప్పటినుంచి కుటుంబం దిక్కు లేనిదైంది. ఎదిగొచ్చిన 20 ఏళ్ల కొడుకు కుటుంబ భారాన్ని తనపై వేసుకున్నాడు. తాపీ పనులకు వెళ్తూ.. వచ్చిన డబ్బుతో కుటుంబానికి తిండి పెడుతున్నాడు. ఈ క్రమంలో లాక్డౌన్ రూపంలో ఆ కుటుంబంపై మరో పిడుగు పడింది. లాక్డౌన్ విధించడంతో అతని పని పోయింది. కనీసం రేషన్ కార్డు కూడా లేకపోవడంతో ప్రభుత్వం నుంచి అందే సాయం కూడా రాలేదు.
10 రోజులుగా బుక్కెడు బువ్వ లేక...
చుట్టుపక్కల వాళ్లు తినడానికి ఏమైనా ఇస్తారేమోనని రోజూ వారి ఇళ్లకు వేళ్లేవాళ్లమని గుడ్డి తెలిపారు. కానీ ఒకటి,రెండు రోజులకు మించి తమకు తిండి పెట్టేంత స్తోమత వారికి కూడా ఉండేది కాదన్నారు. గ్రామ సర్పంచ్ వద్దకు కూడా వెళ్లి తాను సహాయం కోరానని చెప్పారు. రూ.100 సాయం చేయమని కోరితే తన వద్ద లేవని చెప్పాడన్నారు.
రేషన్ షాపు వద్దకు వెళ్లి 5 కిలోల బియ్యం అడిగితే... అతను కూడా ఇవ్వలేదన్నారు. ఇక తాను ఇంకెక్కడికిపోయేది... ఎవరిని అడిగేది అని ఆవేదన వ్యక్తం చేశారు. గత రెండు నెలలుగా ఎవరైనా కాస్త పెడితే... దానితోనే ఆ కుటుంబమంతా కడుపు నింపుకుంటోంది. కానీ గత 10 రోజులుగా ఆ కాస్త కూడా పెట్టేవారు కరువయ్యారు. దీంతో తిండి లేక ఆ కుటుంబమంతా తీవ్రంగా నీరసించిపోయారు.
కలెక్టర్ ఆగ్రహం...
ఇప్పటికీ ఆ కుటుంబానికి రేషన్ కార్డు,ఆధార్ కార్డు రెండూ లేవు. రెండు నెలలుగా ఆ కుటుంబం పడుతున్న ఆకలి బాధలు ఓ ఎన్జీవో దృష్టికి వెళ్లాయి. వారు చొరవ చూపించి అప్పటికే చిక్కి శల్యమైన ఆ కుటుంబ సభ్యులను ఆస్పత్రిలో చేర్పించారు. ఘటన గురించి తెలిసిన జిల్లా కలెక్టర్ చంద్ర భూషణ్ సింగ్... వెంటనే అధికారులను ఆస్పత్రికి పంపించారు. వారికి రూ.5వేలు తక్షణ ఆర్థిక సాయం అందించారు. సాయం కోసం ఆ కుటుంబం సర్పంచ్ని,రేషన్ షాపు యజమానిని ఆశ్రయించినా.. ఎటువంటి సాయం అందకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం ఆ కుటుంబం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కోలుకున్న తర్వాత వారిని ఇంటికి పంపించనున్నారు.