ఏకబిగిన దంచి కొడుతున్న వర్షం: ఈదురుగాలులు- ఢిల్లీ విమానాలు డైవర్ట్
ఢిల్లీ- నేషనల్ కేపిటల్ రీజియన్ పరిధిలో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. నగర ప్రజలను తీవ్ర అవస్థలకు గురిచేస్తోన్నాయి. కుండపోత వాన కారణంగా పలురహదారులు జలమయం కావడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. వాహనదారులు రోడ్లపై గంటల తరబడి నిలిచిపోయారు. ఈ ఆకస్మిక వాతావరణ మార్పుతో ఉక్కిరిబిక్కిరికి గురి అయ్యారు. ఢిల్లీ- ఎన్సీఆర్ పరిధిలో మరిన్ని వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం సూచించడంతో బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు.
నగరంలోని పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది. దక్షిణం, మధ్య, తూర్పు ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులతో పాటు తీవ్రమైన మెరుపులు, పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. పశ్చిమ ఢిల్లీ, నైరుతి ఢిల్లీ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. నగరంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.

ఈ భారీ వర్షాల కారణంగా నోయిడా, ఘాజియాబాద్, ఫరీదాబాద్ తదితర ఎన్సీఆర్ పరిధిలోని నగరాల్లో వాహనాల రాకపోకలు నత్తనడకన సాగాయి. అనేక ప్రధాన కూడళ్లలో డ్రైనేజీలు పొంగిపొర్లడంతో రహదారులు చెరువులను తలపించాయి. వాన నీరు రోడ్లపై నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. నగరంలో జలమయమైన ప్రాంతాల ఫొటోలను, ట్రాఫిక్ జామ్ల దృశ్యాలు వైరల్ అయ్యాయి.
గుర్గావ్ లోనూ భారీ వర్షం కారణంగా రోడ్లపై నీరు నిలిచిపోయింది. సెక్టార్ 14, సెక్టార్ 15, ఓల్డ్ ఎంజీ రోడ్ తదితర ప్రాంతాలు అధ్వాన్నంగా తయారయ్యాయి. ఇక్కడి మేదాంత అండర్పాస్ నీట మునిగింది. ఈ అండర్ పాస్ నీట మునగడం ఈ సీజన్ లో ఇది మూడోసారి. ఈ మార్గాన్ని ట్రాఫిక్ అధికారులు మూసివేశారు. ఖాదిపూర్, హర్సార్ తదితర ప్రాంతాల్లో సుమారు 83 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షాల దెబ్బకు రోడ్లపై గుంతలు ఏర్పడ్డాయి.
ప్రస్తుతం ఉత్తర- మధ్య భారత్ లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా సాగుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, దేశ వాయువ్య ప్రాంతంలో కేంద్రీకృతమైన రుతుపవన ద్రోణి ప్రభావంతోనే ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో ఈ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం వరకూ ఇదే పరిస్థితి కొనసాగవచ్చని పేర్కొంది.
వాతావరణం అనుకూలించని కారణంగా ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోవాల్సిన 15 విమానాలను ఇతర నగరాలకు మళ్లించారు. వీటిల్లో 12 సర్వీసులను జైపూర్ మళ్లించినట్లు అధికారులు తెలిపారు. మరో రెండింటింని చండీగఢ్, ఒక విమానాన్ని లక్నోకు దారి మళ్లించారు. దీనితో ఆయా విమాన సంస్థలు ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాయి.














Click it and Unblock the Notifications