సిటీకి ఆరెంజ్ అలర్ట్ జారీ- స్కూళ్లు బంద్..!!
Bengaluru rains: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. వాయుగుండంగా మారింది. తీరం వైపు తరుముకొస్తోంది. వచ్చే 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుందని భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. తమిళనాడు ఉత్తరం- ఏపీ దక్షిణ ప్రాంతంలో తీరాన్ని దాటుతుందని తెలిపింది.
ప్రస్తుతం ఈ వాయుగుండం నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. క్రమంగా ఇది వాయవ్య దిశగా కదులుతోంది. ఆ సమయంలో దీని వేగం గంటకు 10 కిలో మీటర్లు. ఈ తెల్లవారు జాము నాటికి చెన్నైకి 440, పుదుచ్చేరికి 460, నెల్లూరుకు 530 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. గురువారం తెల్లవారు జామున పుదుచ్చేరి-నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశం ఉంది.

దీని ప్రభావంతో ఏపీ, తమిళనాడుల్లో భారీ వర్షాలు కురుస్తోన్నాయి. రెండు రోజులుగా ఎడతెరిపినివ్వకుండా ఏకధాటిగా దంచికొడుతున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో మరో 48 గంటల పాటు ఇదే తరహా వాతావరణం ఉండొచ్చు. 17వ తేదీ వరకు వర్షాల తీవ్రత కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది.
అటు బెంగళూరులోనూ వర్షాలు దంచికొడుతున్నాయి. రెండు రోజులుగా కుండపోత వర్షం కురుస్తోంది. దీని దెబ్బకు పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై వర్షపునీరు పోటెత్తింది. వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. బలమైన ఈదురుగాలులకు అక్కడక్కడ చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి.
బృహత్ బెంగళూరు మహానగర పాలికె పరిధిలోని ఈస్ట్, నార్త్, సౌత్ జోన్లల్లో వర్షం తీవ్రత అధికంగా కనిపించింది. బొమ్మసంద్ర, శేషాద్రిపురం, రాజరాజేశ్వరి నగర, రాజాజీనగర, గాంధీనగర, శాంతినగర, మెజస్టిక్, కేఆర్ మార్కెట్, హెబ్బాళ, విద్యారణ్యపుర, యలహంక, హెచ్ఏఎల్, యశ్వంత్పుర, హెచ్ఎంటీ లేఅవుట్, హెచ్ఎస్ఆర్ లేఅవుట్.. వంటి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

ఈ ఉదయం 8 గంటల వరకు చౌడేశ్వరిలో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఇక్కడ 89.50 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. హెచ్ఏఎల్ ఎయిర్పోర్ట్- 88, విద్యారణ్యపుర- 80.50, జక్కూరు- 75.50, జక్కూరు-2- 73, రాజమహల్ గుట్టహళ్లి- 68.50, హొరమావు-2 67.50, దొడ్డనెక్కుండి- 67, పులకేశినగర- 62.50 మిల్లీమీటర్ల మేర వర్షపాతం నమోదైైంది.
వర్షాల తీవ్రత నేడు కూడా కొనసాగుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. బెంగళూరు నగరానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాల కారణంగా నేడు పాఠశాలలకు సెలవును ప్రకటించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ జగదీశ ఓ ప్రకటన విడుదల చేశారు. తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం కల్పించాలంటూ ఐటీ, బీటీ, ఇతర ప్రైవేట్ సంస్థలకు సూచించారు.
వర్షాల ధాటికి చలి మొదలైంది బెంగళూరులో. ఉష్ణోగ్రత భారీగా పడిపోయింది. మంగళవారం రాత్రి కనిష్ఠ ఉష్ణోగ్రత 19 డిగ్రీలుగా నమోదైంది. ఇదే తరహా పరిస్థితులు ఇంకో మూడు రోజులు అంటే ఈ నెల 18వ తేదీ వరకు ఉండొచ్చని భారత వాతావరణ కేంద్రం తెలిపింది.












Click it and Unblock the Notifications