భార్యను రంగంలోకి దించిన సీఎం
రెండు దశల్లో జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. నవంబర్ 13, 20 తేదీల్లో జార్ఖండ్ నిర్వహించడానికి ఎన్నికల సంఘం ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈక్రమంలోనే గెలుపు కోసం అన్ని రాజకీయ పార్టీలు గట్టిగానే శ్రమిస్తున్నాయి. ముఖ్యంమంత్రి హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ మరోసారి అధికారమే చేజిక్కించుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. దీనిలో భాగంగానే హేమంత్ సోరెన్ తమ పార్టీ రెండో జాబితాను విడుదల చేశారు.
35 మంది అభ్యర్థుల పేర్లతో జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ రెండు జాబితాలను విడుదల చేసింది. రెండో జాబితాలో కుటుంబ సభ్యులకు హేమంత్ సోరెన్ అధిక ప్రాధాన్యత ఇచ్చినట్టు కనిపిస్తోంది. సీఎం హేమంత్ సోరెన్ తన సొంత నియోజకవర్గమైన బర్హేట్ (ఎస్టీ) నుంచి పోటీ చేయనున్నారు. ఆయన భార్య కల్పన గాండేయ్ నియోజకవర్గం నుంచి పోటీచేయనున్నారు. హేమంత్ సోదరుడు బసంత్ ఈసారి దుమ్కా నుంచి పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. అసెంబ్లీ స్పీకర్ రవీంద్రనాథ్ మహతో నాలా నుంచి, మంత్రి మిథిలేశ్ ఠాకూర్ గర్వా నుంచి పోటీచేస్తున్నారు. మూడుసార్లు బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన కేదర్ హజారా ఇటీవల హేమంత్ సోరెన్ పార్టీలో చేరారు. ఆయనకు జమూనా నియోజకవర్గం టికెట్ కేటాయించారు.

హేమంత్ సోరెన్ ఇండియా కూటమితో కలిసి పోటీ చేస్తోన్న సంగతి తెలిసిందే. 'ఇండియా' కూటమిలో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్ష పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. జేఎంఎం 70 చోట్ల, ఆర్జేడీ, వామపక్ష పార్టీలు 11 చోట్ల పోటీ చేస్తాయి. ఆర్జేడీ అక్టోబర్ 22న ఆరుగురి పేర్లను ప్రకటించింది. ఇక బీజేపీ సైతం ఈ ఎన్నికల్లో అభ్యర్థులను ప్రకటించింది. స్థానిక పార్టీలతో కలిసి బీజేపీ పోటీ చేస్తోంది. బీజేపీ 68 స్థానాల్లో పోటీచేయనుంది. అలాగే మిత్రపక్షాలైన ఏజేఎస్యూ 10, జేడీ(యూ) 2, ఎల్జేపీ(రాంవిలాస్) 1 స్థానంలో బరిలోకి దిగనున్నాయి. రాష్ట్రంలో నవంబర్ 13, 20 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరుగుతుంది. ఫలితాలను నవంబర్ 23న వెల్లడిస్తారు.












Click it and Unblock the Notifications