అత్యాచారం నుంచి తల్లిని కాపాడిన నాలుగేళ్ల చిన్నారి
ముంబై: ఓ నాలుగేళ్ల చిన్నారి తన తల్లిని పెద్ద సమస్యను బయటపడేసింది. తన తల్లిపై ఓ దుండుగుడు అత్యాచారానికి ప్రయత్నిస్తుండగా నాలుగేళ్ల చిన్నారి ఎలాంటి శబ్ధం చేయకుండా ఇంటి నుంచి బయటికి వచ్చింది. ఆ తర్వాత పెద్దగా కేకలు వేసింది. దీంతో అక్కడి చేరుకున్న ఇరుగుపొరుగువారు తన తల్లిని దుండగుడి నుంచి రక్షించారు.
ఈ ఘటన మహారాష్ట్రలోని ముంబై ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. శర్వంత్ జయపాల్(29) అనే నిందితుడు ఉదయం 7గంటలకు ములుంద్లోని ఓ ఇంట్లోకి చొరబడ్డాడు. ఆ ఇంట్లో మహిళ ఒంటరిగా ఉండటాన్ని గమనించిన నిందితుడు ఆమెపై అత్యాచారానికి యత్నించాడు.
ఆ మహిళ తనను అత్యాచారం చేయవద్దని నిందితుడ్ని వేడుకుంది. ఆమె వేడుకున్నప్పటికీ ఆమె మాటలు వినకుండా కత్తితో బెదిరింపులకు దిగి ఆమె దుస్తులను విప్పేందుకు ప్రయత్నించాడు. కాగా, అక్కడే ఆమె ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
ఒకరు నిద్రిస్తుండగా, మరొక నాలుగేళ్ల చిన్నారి మెళుకువగా ఉంది. తన తల్లి ఏడుస్తుండగా చూసిన ఆమె నిద్రిస్తున్నట్లుగా నటించి.. అవకాశం దొరికిన వెంటనే తలుపుతీసుకుని బయటికి వచ్చింది.
సాయం చేయాలని ఇరుగుపొరుగువారిని కేకలు పెట్టి పిలిచింది. ఆమె కేకలు విన్న స్థానికులు అక్కడికి చేరుకుని నిందితుడ్ని పట్టుకుని దేహశుద్ధి చేశారు. చిన్నారి మొదట తనను పిలిచి సాయం చేయాలని కోరిందని, తాను అందరిని పిలిచి నిందితుడ్ని పట్టుకున్నామని ఓ స్థానికుడు తెలిపారు.
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు. నిందితుడు జయపాల్పై ఇంతకు ముందు పలు కేసులు ఉన్నాయని, నిరుడు కూడా అతడు జైలు శిక్ష అనుభవించాడని పోలీసులు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు, అతడ్ని రిమాండ్కు తరలించారు.