శివసేన డెడ్ లైన్, అమిత్ షా ఎంట్రీ, తాడోపేడో తేల్చుకోవాలి, ఏందీ రామాయణం !
ముంబై/న్యూఢిల్లీ: మహారాష్ట్రలో బీజేపీ-శివసేన అధికారంలోకి రావడానికి 50.50 ఫార్ములా పెద్ద సమస్య అయ్యింది. శివసేన డెడ్ లైన్ తో తాడోపేడో తేల్చుకోవాలని, ఏందీ రామాయణం అని బీజేపీ నేతలు అంటున్నారు. ఎలాగైనా శివసేనతో చర్చలు జరిపి ఓ పరిష్కారానికి మార్గం వెతుక్కోవాలని స్వయంగా కేంద్ర హోం మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రంగంలోకి దిగుతున్నారు.
బుధవారం ముంబై చేరుకుంటున్న అమిత్ షా మొదట మహారాష్ట్ర బీజేపీ శాసన సభ్యుల సమావేశం నిర్వహించనున్నారు. తరువాత అదే రోజు శివసేనతో రాజీ చర్చలు జరపడానికి అమిత్ షా సిద్దం అయ్యారని బీజేపీ వర్గాలు అంటున్నాయి. అయితే 50. 50 ఫార్ములాకే మేము కట్టుబడి ఉన్నామని, అందులో ఎలాంటి మార్పు లేదని, మహారాష్ట్ర సీఎంగా ఆదిత్య ఠాక్రేను కచ్చితంగా చెయ్యాలని శివసేన డిమాండ్ చేస్తోంది.
మీదారి మీదే, మాదారి మాదే: గవర్నర్ తో బీజేపీ, శివసేన వేర్వేరుగా భేటీ, మధ్యలో మరాఠీ !
సీఎం, ఎమ్మెల్యేలతో భేటీ
బుధవారం ముంబై వెలుతున్న కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా తరువాత దేవేంద్ర ఫడ్నవీస్, బీజేపీ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించనున్నారు. ఇదే సమయంలో బీజేపీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకుంటారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఇప్పటికే దేవేంద్ర ఫడ్నవీస్ పేరు దాదాపు ఖరారైయ్యింది. ఇక అమిత్ షా ముందు ఎమ్మెల్యేలు పేరుకు మాత్రమే సీఎం అభ్యర్థిని ఎన్నుకుంటారని బీజేపీ సీనియర్ నాయకుడు ఒకరు అంటున్నారు.
బీజేపీకి ఇండిపెండెట్స్ మద్దతు !
మహారాష్ట్రలో ఎక్కువ మంది ఉన్న ఎమ్మెల్యేలుగా బీజేపీ గుర్తింపు పొందింది. బీజేపీ టిక్కెట్లు రాకపోవడంతో ఆ పార్టీ మీద తిరుగుబాటు చేసి స్వతంత్ర పార్టీ తరుపున పోటీ చేసి ఎమ్మెల్యేలు అయిన వారు ఇప్పుడు బీజేపీకి మద్దతు ఇవ్వడానికి సిద్దం అయ్యారు. మొత్తం 15 మంది ఇండిపెండెట్ ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు ఇవ్వడానికి సిద్దంగా ఉన్నారని ఆ పార్టీ నాయకుడు ఒకరు అంటున్నారు.
గవర్నర్ కు ఏం చెప్పారు ?
సోమవారం మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కౌశ్యారీని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, శివసేన పార్టీ సీనియర్ నాయకుడు దివాకర్ రౌత్ వేర్వేరుగా భేటీ అయ్యారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యడానికి అవకాశం ఇవ్వాలని ఇరు పార్టీల నాయకులు గవర్నర్ కు వేర్వేరుగా మనవి చేశారని తెలిసింది. అయితే దీపావళి శుభాకాంక్షలు చెప్పడానికే బీజేపీ, శివసేన నాయకులు గవర్నర్ భగత్ సింగ్ కౌశ్యారీతో భేటీ అయ్యారని ఆ పార్టీల నాయకులు పైకి చెబుతున్నారు.
శివసేన పంతం
ప్రభుత్వాన్ని రెండున్నరేళ్లు చెరిసంగం పంచుకోవాలని శివసేన డిమాండ్ చేస్తోంది. అయితే పూర్తి కాలం ముఖ్యమంత్రిగా బీజేపీ నాయకుడు ఉంటారని, ఉప ముఖ్యమంత్రి పదవి శివసేనకు ఇస్తామని బీజేపీ నాయకులు అంటున్నారు. అయితే 50. 50 ఫార్ములాకు తాము కట్టుబడి ఉన్నామని, అందులో ఎలాంటి మార్పు లేదని శివసేన అంటోంది. ఈ విషయం ఓ కొలిక్కి తీసుకురావడానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా బుధవారం ముంబై వెలుతున్నారు.
మేము ఏం చెయ్యలేం !
శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే కుమారుడు, శివసేన ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రేకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి మేము సిద్దంగా ఉన్నామని బీజేపీ నాయకులు అంటున్నారు. అయితే మా నాయకుడు ఆదిత్య ఠాక్రేని సీఎం చెయ్యాలని శివసేన నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే బీజేపీలో, శివసేనలో సీనియర్ నాయకులు చాల మంది ఉన్నారని, మొదటి సారి ఎమ్మెల్యే అయిన ఆదిత్య ఠాక్రేకి సీఎం పదవి ఎలా ఇస్తామని బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. శివసేన ఇలాగే డిమాండ్ చేస్తే తాము ఏమీ చెయ్యలేమని ఓ బీజేపీ నాయకుడు అసహం వ్యక్తం చేస్తున్నారు.
డీసీఎం, కీలక మంత్రి పదవులు !
శివసేనకు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు కీలక మంత్రి పదవులు ఇవ్వడానికి సిద్దం అయ్యింది. ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు ఆర్ అండ్ బీ, ప్రజా పనుల శాఖ, నీటి పారుదల శాఖ, విద్యా శాఖ తదితర ముఖ్యమైన మంత్రి పదవులు ఇస్తామని బీజేపీ శివసేన నాయకులకు చెప్పింది. అయితే ఈ విషయంపై శివసేన నాన్చుతూ ఉంది తప్పా ఏ విషయం తేల్చి చెప్పడం లేదు.
సినిమా చూస్తున్న ఎన్సీపీ, కాంగ్రెస్
మహారాష్ట్రలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను ప్రతిపక్ష ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. బీజేపీ నుంచి శివసేన తెగతెంపులు చేసుకుంటే తాము మద్దతు ఇవ్వడానికి సిద్దంగా ఉన్నామని కొందరు ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు. అయితే శివసేన ఏలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలుసుకుని తరువాత ముందుకు వెలుదామని ఎస్పీనీ నేత శరాద్ పవార్ తన సన్నిహితులతో అన్నారని తెలిసింది.