పెను విషాదం: కల్తీ మద్యం తాగి 15 మంది బలి!
మహారాష్ట్రలోని పుణె, పింప్రి-చించ్వాడ్ పారిశ్రామిక పరిసర ప్రాంతాల్లో కల్తీ మద్యం పెను కలకలం సృష్టించింది. నకిలీ మద్యం తాగి 15 మంది ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రులలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. పింప్రి-చించ్వాడ్ పరిధిలోని దాపోడి, ఫుగేవాడి ప్రాంతాల్లో 8 మరణాలు సంభవించాయి. దీంతో పాటు పుణె నగర పరిధిలోని కాలే పడల్ ప్రాంతంలో ముగ్గురు, హడప్పర్ ప్రాంతంలో ఇద్దరు చొప్పున ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మృతుల సంఖ్య 15కు చేరిందని అధికారిక వర్గాలు ధ్రువీకరించాయి.
పాత నేరస్థుడి పనే.. రంగంలోకి దిగిన యోగేష్ వాంఖడే ముఠా
ఈ ఘారానికి కారణమైన నకిలీ, కల్తీ మద్యాన్ని యోగేష్ వాంఖడే అనే స్థానిక అక్రమ మద్య వ్యాపారి తయారు చేసినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు. అతనికి గతంలోనే ఈ ప్రాంతంలో అక్రమంగా నాటు సారా, నకిలీ మద్యం సరఫరా చేసే ముఠాలతో సంబంధాలు ఉన్నాయని, ఇతనిపై ఇప్పటికే వివిధ పోలీస్ స్టేషన్లలో పలు కేసులు కూడా నమోదై ఉన్నాయని దర్యాప్తు అధికారులు వెల్లడించారు.ఈ క్రమంలో పోలీసులు ప్రధాన నిందితుడు యోగేష్తో పాటు ఈ అక్రమ రవాణాలో కీలక పాత్ర పోషించిన అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. మృతులు సేవించిన మద్యం నమూనాలను ల్యాబ్కు పంపించామని, అందులో ఏయే ప్రాణాంతక కెమికల్స్ కలిపారనేది వైద్య పరీక్షల నివేదిక తర్వాతే స్పష్టమవుతుందని అధికారులు పేర్కొన్నారు.

ఎవరినీ వదిలిపెట్టొద్దు.. సీఎం ఫడ్నవీస్ సీరియస్!
ఈ కల్తీ మద్యం మిగిల్చిన పెనువిషాదం మహారాష్ట్ర రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది.ఈ ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సీరియస్గా స్పందించారు. ఇంత మంది ప్రాణాలు ప్రాణాలు పోవడానికి కారణమైన అక్రమార్కులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలన పుణె, పింప్రి-చించ్వాడ్ పోలీస్ కమిషనర్లను ఆయన నేరుగా ఆదేశించారు. "ఈ అక్రమ మద్యం దందా వెనుక ఎంతటి రాజకీయ అండదండలు ఉన్నా, ఎంతటి పెద్దవారున్నా సరే ఎవరినీ వదిలిపెట్టొద్దు. బాధ్యులపై కఠినమైన చట్టపరమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకోండి" అని పోలీసు ఉన్నతాధికారుల యంత్రాంగాన్ని సీఎం ఆదేశించారు.
రంగంలోకి ఎక్సైజ్ శాఖ.. గుట్టురట్టు చేసేందుకు దాడులు
ఈ కేసు తీవ్రత దృష్ట్యా పుణె, పింప్రి-చించ్వాడ్ రెండు నగరాల పోలీస్ బృందాలు సంయుక్తంగా సమగ్ర విచారణ జరపాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘోరానికి కారణమైన నకిలీ మద్యం తయారీ కేంద్రాలు, స్థావరాలపై ప్రస్తుతం రెండు నగరాల పరిధిలో పోలీసులు ముమ్మరంగా దాడులునిర్వహిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఎనిమిది మందిని అరెస్ట్ చేశామని, వారిపై నాన్-బైలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని అధికారులు వెల్లడించారు. ఈ మద్యం ఎక్కడి నుంచి సరఫరా అయింది, దీని వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు అనే ఖచ్చితమైన వివరాలను తెలుసుకునేందుకు పోలీసులతో పాటు రాష్ట్ర ఎక్సైజ్ (ఆబ్కారీ) శాఖ కూడా రంగంలోకి దిగి సమాంతర దర్యాప్తును ప్రారంభించింది.












Click it and Unblock the Notifications