ఆ రాష్ట్రంలో హుక్కా సెంటర్లు నిర్వహించడం నిషేధం
మహారాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంలో హుక్కా సెంటర్లపై నిషేధం విధించింది. ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. మహారాష్ట్రలో హుక్కా సెంటర్లు నిర్వహించరాదని పేర్కొంటూ ఈ ఏడాది ఏప్రిల్లో ఆ రాష్ట్ర అసెంబ్లీ బిల్ పాస్ చేసింది. ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో ఇది అమల్లోకి వస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. హుక్కా సెంటర్లు నడిపితే శిక్షార్హులు అవుతారని తెలిపింది ప్రభుత్వం. లక్షరూపాయల జరిమానాతో పాటు.. మూడేళ్లు జైలుశిక్ష కూడా విధించబడుతుందని ఫడ్నవీస్ సర్కార్ వెల్లడించింది.
గుజరాత్ తర్వాత హుక్కసెంటర్లను పూర్తిస్థాయిలో నిషేధం విధించిన రెండో రాష్ట్రంగా మహారాష్ట్ర గుర్తింపుపొందింది. తాజాగా నిషేధం విధిస్తూ చట్టం తీసుకురావడంతో ఇక హుక్కా కేంద్రాలు నడవకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని రాష్ట్ర హోంశాఖ వెల్లడించింది. హోంశాఖ మాత్రం హుక్కా కేంద్రాలను మెల్లగా నియంత్రిస్తూ వద్దామని భావించినప్పటికీ సీఎం ఫడ్నవీస్ మాత్రం వెంటనే అమలు చేయాలని ఆదేశించారు. ఇందుకు కారణం డిసెంబర్ 2017లో కమలా మిల్స్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 14 మంది చనిపోయారని ఇకపై జాగ్రత్త పడేందుకే వెంటనే అమల్లోకి తీసుకురావాల్సిందిగా ఫడ్నవీస్ ఆదేశించినట్లు హోంశాఖ అధికారులు తెలిపారు.
ఘటనపై విచారణ చేయించగా హుక్కా నుంచి వచ్చిన మంటల కారణంగానే ప్రాణనష్టం జరిగిందని విచారణ సంస్థ తెలిపింది. ఈ క్రమంలోనే హుక్కాలపై నిషేధం విధించాలని పలు సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చాయి. బాంబే హైకోర్టు నుంచి హుక్కా నిషేధించాలని ఆదేశాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం పెద్దల అండతో హుక్కా కేంద్రాలను నడిపారని క్యాన్సర్ సర్జన్ డాక్టర్ పంకజ్ చతుర్వేది గుర్తుచేశారు. ఇకనైనా చాలా కఠినంగా నిషేధం అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.