నా భార్యను హత్య చేశాను అరెస్టు చెయ్యండి: ఇంటికి వెళ్లిన బెంగళూరు పోలీసులకు షాక్!
బెంగళూరు: బెంగళూరులో విచిత్రమైన సంఘటన జరిగింది. భార్య మీద దాడి చేసిన భర్త ఆమె చనిపోయిందని అనుకుని పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. తన భార్యను హత్య చేశానని, తుమకూరు, నెలమంగలలో ఉన్న తన కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి తనను అరెస్టు చెయ్యాలని వేడుకున్నాడు.
తన భార్యను హత్య చేసిన విషయం మూడేళ్ల కుమార్తెకు చెప్పకూడదని భర్త పోలీసులకు మనవి చేశాడు. పోలీసులు ఇంటికి వెళ్లి చూడగా షాక్ కు గురైనారు. బెంగళూరు నగరంలోని చెన్ననాయనపాళ్యలో రఘుగౌడ (27), పుష్పలత దంపతులు నివాసం ఉంటున్నారు.

రఘుగౌడ, పుష్పలత దంపతులకు మూడు సంవత్సరాల కుమార్తె ఉంది. దంపతుల మధ్య చిన్న విషయంలో గొడవ జరిగింది.ఆ సందర్బంలో రఘుగౌడ భార్య పుష్పలత మీద దాడి చేశాడు. దాడి చేసిన సమయంలో పుష్పలత కిందపడి స్పృహకోల్పోయింది.
తన భార్య చనిపోయిందని అనుకున్న రఘుగౌడ నేరుగా పోలీస్ స్టేషన్ చేరుకుని లొంగిపోయాడు. పోలీసులు ఇంటికి వెళ్లి చూడగా స్పృహలోకి వచ్చిన పుష్పలత లేచి గోడకు ఆనుకుని కుర్చుని దర్శనం ఇచ్చింది. ఒక్క నిమిషం షాక్ కు గురైన పోలీసులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. పుష్పలత కోలుకుంటున్నదని హత్యయత్నం కింద కేసు నమోదు చేసి రఘగౌడను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications