టీ బిల్లు పెడితే సిఎంగా తప్పుకుంటా: కిరణ్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడితే తాను పదవి నుంచి తప్పుకుంటానని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యం ఉంచడానికి తాను పదవికి రాజీనామా చేస్తానని ఆయన చెప్పారు. శాసనసభ తిరస్కరించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడితే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన చెప్పారు. తన రాజకీయ భవిష్యత్తుపై తనకు ఆందోళన లేదని, తనకు రాజకీయ భవిష్యత్తు ముఖ్యమని ఆయన అన్నారు.
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అధికార ప్రతినిధిలా వ్యవహరిస్తోందని కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వంపై ఆయన మరోసారి ధిక్కార స్వరం వినిపించారు. ఆయన ఎన్డీటీవీతో రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ మాట్లాడారు. తెలంగాణ బిల్లు ఎట్టి పరిస్థితిలోనూ పార్లమెంటుకు రాదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. శాసనసభ తిరస్కరించిన తర్వాత ఏ విభజన బిల్లు కూడా పార్లమెంటుకు రాలేదని, కొత్త రాష్ట్రం ఏర్పడలేదని ఆయన అన్నారు. రాష్ట్రాలను గౌరవించకపోతే తాము కేంద్రాన్ని ఎందుకు గౌరవించాలని ఆయన అడిగారు.
శాసనసభ తిరస్కరించిన బిల్లును రాష్ట్రపతి పార్లమంటుకు పంపుతారని అనుకోనని ఆయన అన్నారు. కొత్త పార్టీ ఏర్పాటుపై ఆయన నేరుగా స్పందించలేదు. కాలమే సమాధానం చెబుతుందని ఆయన అన్నారు. విభజనను అడ్డుకోవడానికి కొత్త పార్టీ మార్గమని అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని 70-80 శాతం మంది విభజనను వ్యతిరేకిస్తున్నారని ఆయన చెప్పారు. విభజనకు జరగాల్సిన కసరత్తు చాలా ఉందని ఆయన చెప్పారు.
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో తాను ఒంటరిని కానని ఆయన అన్నారు. విభజన జరిగితే రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజలు నష్టపోతారని ఆయన అన్నారు. విభజన జరిగితే తెలంగాణ ప్రాంతం సైతం నష్టపోతుందని అన్నారు. బిల్లులో వివరణలన్నీ అస్పష్టంగా ఉన్నాయని ఆయన మండిపడ్డారు. బిల్లుకు తాము 9 వేలకుపైగా సవరణలు ప్రతిపాదించినట్లు కిరణ్ రెడ్డి తెలిపారు. శాసనసభకు పంపిన బిల్లు లోపభూయిష్టంగా ఉందని అన్నారు.
తాను రాష్ట్రానికి 16వ ముఖ్యమంత్రిని అని, అది తాత్కాలికమైన పదవి అని, రాష్ట్రమూ ప్రజలూ శాశ్వతమని ఆయన అన్నారు. కొంత మంది తెలంగాణను కోరుకుంటున్నారని, తాను దాన్ని అన్యాయమని అనడం లేదని, రాష్ట్ర విభజన జరిగితే ప్రజలకు నష్టం జరుగుతుందనేదే తన ఆవేదన అని ఆయన అన్నారు. తాను ప్రజల పక్కన నిలబడుతానని ఆయన అన్నారు.