త్రిష చిచ్చు: భగ్గుమంటోన్న తమిళనాడు: ఉదయనిధి అరెస్ట్ తో డీఎంకే రోడ్లపైకి: ఎక్కడికక్కడ
తమిళనాడు రాజకీయాల్లో ఈ ఉదయం ఊహించని విధంగా భారీ హైడ్రామా చోటుచేసుకుంది. ప్రముఖ సినీ నటి త్రిషపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ప్రతిపక్ష నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ అయ్యారు. ఆయనను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అనూహ్య పరిణామం.. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. డీఎంకే నాయకులు రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు. ఎక్కడికక్కడ రోడ్లపైకి వచ్చారు.
కావేరీ నదీ జలాల విడుదలలో తమిళనాడుకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, దీన్ని ముఖ్యమంత్రి విజయ్ ఏమాత్రం పట్టించుకోవట్లేదని ఆరోపిస్తూ డీఎంకే సోమవారం తంజావూరులో ఓ భారీ ర్యాలీ నిర్వహించింది. ఉదయనిధి స్టాలిన్ ఇందులో ప్రసంగించారు. ఆయన ప్రసంగిస్తోన్న సమయంలో కొందరు డీఎంకే కార్యకర్తలు 'త్రిష, త్రిష' అని నినాదాలు చేశారు. దీంతో ఉదయనిధి తన ప్రసంగాన్ని కొద్దిసేపు ఆపివేశారు. త్రిషను ఉద్దేశించి ద్వంద్వార్థాలు వచ్చేలా మాట్లాడారు. ఈ వీడియోలు వైరల్ అయ్యాయి.

టీవీకే నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉదయనిధి స్టాలిన్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం ఆరు సెక్షన్ల కింద ఈ కేసు నమోదైంది. ఆయనను అరెస్ట్ చేయడానికి పోలీసులు.. చెన్నైలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. ఇంటి వెలుపల భారీగా దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అరెస్ట్ నేపథ్యంలో ఉదయనిధి స్టాలిన్.. యాంటిసిపేటరీ బెయిల్ కోసం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. పిటీషన్ దాఖలు చేశారు. ఈలోపే ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు.
దీనిపై ఉదయనిధి స్టాలిన్ ఘాటుగా స్పందించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ప్రభుత్వం తనను అరెస్ట్ చేయించిందనీ మండిపడ్డారు. చట్టం ప్రకారం ఎదురయ్యే ఎలాంటి పరిణామాలనైనా ధీటుగా ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. తాను చేసిన ప్రసంగంలోని వ్యాఖ్యలను కొందరు కావాలనే రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు కోణంలో ప్రచారం చేస్తున్నారని, తాను ఏ వ్యక్తిని నిర్దేశిస్తూ ఆ వివాదాస్పద కామెంట్స్ చేయలేదని స్పష్టం చేశారు.
ప్రసంగించేటప్పుడు త్రిష పేరును కొందరు కార్యకర్తలు ప్రస్తావించారని, ఆ సమయంలో తాను ప్రసంగాన్ని కూడా నిలిపివేశానని ఉదయనిధి స్టాలిన్ గుర్తు చేశారు. కావేరీ నదీ జలాల వ్యవహారంలో ఒక్క విజయ్ ను తప్ప ఎవరి పేరునూ తాను ఉచ్ఛరించలేదని పేర్కొన్నారు. అయినప్పటికీ- రాజకీయ దురుద్దేశంతో తనపై టీవీకే నాయకలు కేసులు నమోదు చేశారని, కక్షతోనే అరెస్ట్ చేయించారని స్టాలిన్ అన్నారు. కావేరీ జలాల వివాదంపై గొంతెత్తి మాట్లాడుతున్నామనే కారణంతోనే అణచివేయడానికి ప్రయత్నిస్తోన్నారని విమర్శించారు.
ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ వ్యవహారంతో డీఎంకే నాయకులు రోడ్ల మీదికి వచ్చారు. ఎక్కడికక్కడ ఆందోళనలకు దిగారు. టీవీకే వ్యతిరేకంగా అప్పటికప్పుడు ర్యాలీలను నిర్వహించారు. చెన్నై, కోయంబత్తూర్, తూత్తుకుడి, తంజావూరు, మధురై, కాళ్లకురిచ్చి, చెంగల్ పట్టు, విరుధునగర్, ఈరోడ్, దిండిగల్, కరూర్, ధర్మపురి, కృష్ణగిరి, తిరునెల్వేలి, తిరుచిరాపల్లి.. ఇలా దాదాపు అన్ని చోట్ల కూడా డీఎంకే నాయకులు ఆందోళనకు దిగారు.















Click it and Unblock the Notifications