ఆవులు, గేదెలకు సరికొత్త గుర్తింపు. అధికారిక జాబితాలోకి 16 జంతు జాతులు!
వాతావరణ మార్పులు, పెరిగే ఉష్ణోగ్రతల వల్ల రాబోయే రోజుల్లో ఆహార భద్రతకు పెద్ద ముప్పు పొంచి ఉందనే హెచ్చరికల నడుమ భారత రసాయన, వ్యవసాయ పరిశోధన మండలి (ICAR) ఒక తీపి కబురు అందించింది. మన దేశానికి చెందిన అత్యంత శక్తివంతమైన, స్థానిక వాతావరణాన్ని తట్టుకునే 16 కొత్త రకాల దేశీయ పశు జాతులకు అధికారికంగా గుర్తింపునిచ్చింది.
దీంతో ఇప్పటివరకు భారతదేశంలో సైంటిఫిక్గా గుర్తింపు పొందిన దేశీయ పశువుల సంఖ్య ఏకంగా 262కు చేరింది. మారుతున్న కాలగుణానికి అనుగుణంగా తక్కువ ఖర్చుతో, వ్యాధులను తట్టుకుంటూ అధిక దిగుబడిని ఇచ్చే మన సొంత రకాలను కాపాడుకోవడంలో ఈ గుర్తింపు ఒక మైలురాయిగా నిలవనుంది.
ఇటీవలే నమోదు చేసిన ఈ 16 కొత్త జాతులు దేశంలోని 13 రాష్ట్రాలతో పాటు జమ్మూ కశ్మీర్ వరకు విస్తరించి ఉన్నాయి. వీటిలో 4 రకాల ఆవులు (ఉమర్దా, పెరియార్, కొప్పల్, మహకోశాలి), 4 రకాల గొర్రెలు (మడ్గ్యాల్, సీమాంచలి, కౌ దేబర్, అసోమి) ఉన్నాయి. వీటితో పాటు రెండు మేక రకాలు (తోతాపురి, బత్తిసి), ఒక గేదె రకం (గోమాంచలి) ఉన్నాయి. అలాగే ప్రత్యేకమైన జాతులకు చెందిన కొంబాయ్ రకం కుక్క, నాగా పంది, కశ్మీరి గుర్రం, బ్రజ్ గాడిద, సిక్కిం యాక్ (జడల బర్రె) కూడా ఈ గుర్తింపు జాబితాలో చేరడం విశేషం. రాజస్థాన్, యూపీ, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఈ జాతులు ఎక్కువగా కనిపిస్తాయి.

మన దేశీయ జాతుల గొప్పతనమే వేరు!
కర్నాల్లోని 'నేషనల్ బ్యూరో ఆఫ్ యానిమల్ జెనెటిక్ రీసోర్సెస్' (NBAGR) ఈ రికగ్నిషన్ ప్రక్రియను పూర్తి చేసింది. స్థానిక వాతావరణ పరిస్థితులకు తట్టుకుని జీవించడం, ప్రతికూల వాతావరణంలో కూడా రోగనిరోధక శక్తిని ప్రదర్శించడం ఈ దేశీయ జాతుల ప్రత్యేకత అని అధికారులు పేర్కొన్నారు. జాతి స్పష్టత లేని (నాన్-డిస్క్రిప్ట్) పశువులను గుర్తించి, వాటి జన్యువులను కాపాడటం వల్ల భవిష్యత్తు తరాలకు నాణ్యమైన పశుసంపద అందుతుందని వివరిస్తున్నారు. తక్కువ మేతతో ఎక్కువ ఉపయోగపడే ఈ రకాలు గ్రామీణ పేదల ఆర్థిక స్థితిని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
మొత్తం 262కి చేరిన భారతీయ జాతులు
తాజా చేరికలతో కలిపి మన దేశంలో అధికారిక గుర్తింపు పొందిన ఆవు జాతుల సంఖ్య 59కి చేరగా, గేదెల సంఖ్య 23కి చేరింది. వీటితో పాటు 50 గొర్రె జాతులు, 45 మేక జాతులు, 16 పంది జాతులతో పాటు గుర్రాలు, ఒంటెలు, బాతులు, గాడిదలు, కుక్కలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. మన దేశీయ రకాలను సైంటిఫిక్గా రికార్డు చేయడం వల్ల వాటి అంతరించిపోయే ముప్పు తప్పుతుందని, రాబోయే రోజుల్లో పశుపోషకులకు ప్రభుత్వ పథకాల ద్వారా సహాయం అందించడం కూడా తేలికవుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.














Click it and Unblock the Notifications