జియోకు పోటీగా.. ఐడియా నుంచి మరో సూపర్ ఆఫర్
జియోకు పోటీగా ఐడియా సెల్యులార్ కూడా శుక్రవారం ఓ సరికొత్త ఆఫర్ ప్రకటించింది. 4జీ మొబైల్ యూజర్లకు రోజుకి 1జీబీ చొప్పున 4జీ డేటాను అందించనుంది.
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో ఫీవర్ ఇప్పుడప్పుడే వదిలేలా లేదు. దేశీయ టెలికాం కంపెనీలు జియో బారినుంచి తమను తాము కాపాడుకునే ప్రయత్నాల్లో భాగంగా వినియోగదారులపై ఆఫర్ల వర్షం కురిపిస్తున్నాయి.
తాజాగా ఐడియా సెల్యులార్ శుక్రవారం ఓ సరికొత్త ఆఫర్ ప్రకటించింది. పోస్ట్ పెయిడ్ వినియోగదారుల కోసం కొత్త ప్లాన్ పరిచయం చేసింది. దీని ప్రకారం 4జీ మొబైల్ యూజర్లకు రోజుకి 1జీబీ చొప్పున 4జీ డేటాను అందించనుంది.
లిమిటెడ్ రెంటెడ్ ప్లాన్స్ లో ప్రీ పెయిడ్ యూజర్లందరికీ ఈ ప్రయోజనాలు అందుబాటులో ఉన్నట్లు పేర్కొంది. కొత్త ఐడియా ప్యాక్స్ రూ.199 నుంచి మొదలవుతాయి. ఈ కొత్త పథకం ప్రకారం.. రూ.499 ఆపైన ప్లాన్ లో రూ.300 విలువైన డేటా సేవలు ఉచితమని కంపెనీ చెబుతోంది.
ఐడియా సమాచారం ప్రకారం రూ.349-రూ.498 మధ్య రెంటల్ ప్లాన్ లో రూ.50 డిస్కౌంట్, అలాగే రూ.149-రూ.349 మధ్య రెంటల్ ప్లాన్ లో ఖాతాదారులకు రూ.100 డిస్కౌంట్ అందించనున్నట్లు తెలిపింది.
రూ.300 యాడ్ ఆన్ ప్యాక్ తో రోజుకు 1 జీబీ చొప్పున నెల రోజుల పాటు 4జీ డేటాను అందించనుంది. రూ.349 లేదా అంతకంటే ఎక్కువ రెంటల్ ఉన్న పోస్ట్ పెయిడ్ కస్టమర్లు రూ.50 అదనంగా చెల్లించి మూడు నెలల పాటు ఈ ఆఫర్ ను పొందొచ్చని ఐడియా స్పష్టం చేసింది.
మూడు నెలల తరువాత కూడా మార్చి 2018 వరకు ఈ డిస్కౌంట్ ఆఫర్ ను పొందాలంటే రూ.199-రూ.349 మధ్య ప్లాన్ లో అదనంగా రూ.200, రూ.349-రూ.498 మధ్య ప్లాన్ లో అదనంగా రూ.50 చెల్లిస్తే సరిపోతుందని వివరించింది. ఈ ప్లాన్స్ నమోదు ఏప్రిల్ 30 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ కేవలం 4జీ హ్యాండ్ సెట్లు వినియోగించే యూజర్లకు మాత్రమే.