బ్యాంకు ఖాతాదారులకు శుభవార్త.. ఇక ఎలాంటి ఛార్జీలు ఉండవు..
ఆధార్ పే యాప్ ద్వారా నగదు చెల్లింపులపై ఎలాంటి లావాదేవీ ఛార్జీలు ఉండవు. ఈ ఆండ్రాయిడ్ ఆధారిత యాప్ ను ఐడీఎఫ్ సీ బ్యాంకు ఆవిష్కరించింది.
ముంబై: కేంద్రం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయంతో సామాన్యుడికి పట్టపగలే చుక్కలు కనిపించాయి. దాని వల్ల ఒనగూరిన ప్రయోజనం ఏమీ లేదనే విమర్శలు వెల్లువెత్తాయి. నోట్ల రద్దు గాయాలు ఇప్పుడిప్పుడు మానుతుండగా, మళ్లీ ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు తీసుకున్న నిర్ణయం మానుతున్న పుండును గిల్లి కారం చల్లిన చందంగా మారింది.
నోట్ల రద్దు సమయంలో డబ్బులు డ్రా చేసుకునేందుకు ఏటీఎంల ముందు పడిగాపులు కాచిన సామాన్యుడు ఇప్పడు ఏటీఎం వైపు వెళ్లాలంటేనే జంకుతున్నాడు. దీనికి కారణం బ్యాంకులు ఇటీవల తీసుకున్న అడ్డగోలు నిర్ణయాలే.
బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేసినా, డబ్బులు డ్రా చేసినా ఛార్జీలు వసూలు చేయడంపై సామాన్యుడు కారాలుమిరియాలు నూరుతున్నాడు. అయితే బ్యాంకుల ఈ బాదుడు నుంచి తప్పించుకునే మార్గం ఒకటి ఉంది.

అదే.. ఆధార్ ఆధారిత యాప్ ద్వారా నగదు చెల్లింపులు చేయడం. ఆధార్ పే యాప్ ద్వారా నగదు చెల్లింపులపై ఎలాంటి లావాదేవీ ఛార్జీలు ఉండవు. ఈ ఆండ్రాయిడ్ ఆధారిత యాప్ ను ఐడీఎఫ్ సీ బ్యాంకు ఆవిష్కరించింది.
ఈ యాప్ ఉంటే డెబిట్, క్రెడిట్ కార్డ్ ఏదీ అవసరం లేదు. దుకాణదారుడు ఈ యాప్ ను స్మార్ట్ ఫోన్ లో డౌన్లోడ్ చేసుకుని, బయోమెట్రిక్ లేదా ఫింగర్ ప్రింట్ స్కానర్ కు కనెక్ట్ చేస్తే చాలు. కొనుగోలుదారుడు తన ఆధార్ నంబర్ ను అందులో నమోదు చేసి, బ్యాంకును సెలెక్ట్ చేసుకుంటే చాలు. ఇక నగదు చెల్లించడమే తరువాయి. ఈ యాప్ ద్వారా చెల్లింపులు జరిపితే ఎలాంటి లావాదేవీ ఫీజులు, ఛార్జీలు ఉండవు.












Click it and Unblock the Notifications