మోడీ గనుక విఫలమైతే.. నేనే ప్రతీకారం తీర్చుకుంటా: అమర జవాన్ తల్లి
కుప్వారాలో ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. అన్యాయంగా తమ బిడ్డలను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
కాన్పూర్: కుప్వారాలో ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. అన్యాయంగా తమ బిడ్డలను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రధాని మోడీ గనుక ఈ విషయంలో విఫలమైతే.. తానే స్వయంగా ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకుంటానని కుప్వారా ఉగ్రదాడిలో మరణించిన కెప్టెన్ ఆయుష్ యాదవ్ తల్లి ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఉగ్రదాడికి ముందురోజు తనతో మాట్లాడిన కుమారుడు.. మరుసటిరోజే ఉగ్రవాదుల ఘాతుకానికి బలవ్వడంతో ఆ తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. ఆయుష్ యాదవ్ తండ్రి కూడా ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు, ప్రభుత్వంపై తనకెలాంటి నమ్మకం లేదని అసహనం వ్యక్తం చేశారు.
కాగా, ఒక కెప్టెన్ సహా ముగ్గురు జవాన్లు అమరులు కాగా, మరో ఐదుగురు సైనికులు క్షతగాత్రులయ్యారు. దాడికి పాల్పడింది జైషే మహ్మద్ సంస్థకు చెందిన వారుగా భావిస్తున్న సైన్యం ఇద్దరు మిలిటెంట్లను మట్టుబెట్టగా.. మరో ఉగ్రవాది తప్పించుకున్నాడు. ప్రస్తుతం ఆ ఉగ్రవాదిని పట్టుకునేందుకు భద్రతా బలగాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి.
అనంత్ నాగ్ లో ఉగ్రవాది అరెస్టు:
అనంతనాగ్ లో బ్యాంకు దోపిడీకి పాల్పడిన ఒక ఉగ్రవాదిని పోలీసులు అరెస్టు చేయగా.. మరో ఉగ్రవాది తప్పించుకున్నాడు. జమ్ము కశ్మీర్ బ్యాంకులో శుక్రవారం నాడు ఈ ఘటన చోటు చేసుకుంది. తుపాకులతో లోపలికి చొరబడిన ఉగ్రవాదులు.. అక్కడే ఉన్న జవాను నుంచి రైఫిల్ లాక్కునేందుకు ప్రయత్నించారు.
అక్కడే ఉన్న మరో జవాను ఉగ్రవాదులను అడ్డుకోవడంతో.. ఇద్దరిలో ఒక ఉగ్రవాదిపై జవానుపై కాల్పులు జరుపుతూ పారిపోయాడు. సీర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ కౌశల్ కుమార్ ఈ ఘటనలో స్వల్పంగా గాయాలయ్యాయి.